ఏపీలో కొత్తగా 7,822 కరోనా కేసులు.. 63 మంది మృతి
ABN , First Publish Date - 2020-08-04T00:58:48+05:30 IST
ఆంధ్రప్రదేశ్లో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయే
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. గత 24 గంటలుగా 45,516 మందికి కరోనా టెస్ట్లు చేయగా 7,822 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే మొత్తం కేసుల సంఖ్య 21 లక్షల 10 వేల 923కి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మరో 63 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ నమోదైన మరణాల సంఖ్య 1,537కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 76,377 ఉండగా 85,777 మంది కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.
తూర్పుగోదావరిలో భారీగా..
తూర్పుగోదావరి, అనంతపురం, విశాఖపట్నం జిల్లాల్లో పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో గత వారం రోజుల క్రితం భారీగా కేసులు నమోదయ్యేవి. అయితే పశ్చిమ గోదావరిలో మాత్రం రోజురోజుకూ కేసులు తగ్గుతూ వస్తుండగా తూర్పుగోదావరిలో మాత్రం పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి చూస్తే రాయలసీమలో అనంతపురం జిల్లాలో.. కోస్తా ఆంధ్రలో తూర్పుగోదావరిలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తూర్పుగోదావరిలో-1113, విశాఖపట్నంలో-1049, అనంతపురంలో-953 కేసులు నమోదయ్యాయి.
డిశ్చార్జ్, మరణాలు లెక్కలివీ..
ఇక మరణాల సంఖ్య చూస్తే.. పశ్చిమ గోదావరి జిల్లాలో-11, విశాఖపట్నంలో-09, ప్రకాశంలో-08, నెల్లూరులో-07, శ్రీకాకుళంలో-07, విజయనగరంలో-04, చిత్తూరులో-03, కృష్ణాలో-03, కర్నూల్లో-03, అనంతపురంలో-02, తూర్పుగోదావరిలో-02, గుంటూరులో-02, కడప జిల్లాలో-02 మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో 5,786 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కాగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో 21,10,923 శాంపిల్స్ను పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
ఏ జిల్లాలో ఎన్ని కేసులు..!?