పోలీసులకు సవాల్!
ABN , First Publish Date - 2020-07-09T09:43:04+05:30 IST
పోలీసులకు కొవిడ్ సవాల్ విసురుతోంది. విధి నిర్వహణలో జిల్లాలోని వివిధ విభాగాల పోలీసులు కొవిడ్ బారిన పడుతున్నారు. దీంతో పోలీసుల్లో
విధి నిర్వహణలో కొవిడ్ బారిన..
ఇప్పటిదాకా జిల్లాలో 19 మంది అన్ని విభాగాల పోలీసులకు వైరస్
78 ఏపీఎస్పీ పోలీసులకూ కొవిడ్
ఆందోళనలో యంత్రాంగం
కాకినాడ క్రైం, జూలై 8: పోలీసులకు కొవిడ్ సవాల్ విసురుతోంది. విధి నిర్వహణలో జిల్లాలోని వివిధ విభాగాల పోలీసులు కొవిడ్ బారిన పడుతున్నారు. దీంతో పోలీసుల్లో ఆందోళన నెల కొంది. తొలుత ఏపీఎస్పీ బెటాలియన్ సిబ్బందికి వైరస్ సోకింది. ఇప్పుడు ఇది సివిల్ పోలీసులకు విస్తరించింది. ఎస్హెచ్వో, డీఎస్పీ వంటి అధికా రులూ వైరస్ బారినపడుతూ బాధితులుగా మారుతున్నారు. ఈ వరుస సంఘటనలతో పోలీసు ఉన్నతాధికారులు కలవరపడుతున్నారు. శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, బందోబస్తు వంటి విధుల్లో నిమగ్నమవుతున్న వీరు కంటికి కనిపించని వైరస్తో పోరాడుతున్నారు. జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో వైరస్ భయం పట్టుకోవడంతో వీరి విధుల నిర్వహణ సవాల్గా మారింది.
అసలే సిబ్బంది కొరతతతో ఉన్న పోలీసు యంత్రాంగం పాజిటివ్ కేసులు పెరుగు తుండడంతో కొందరు సిబ్బంది హోంక్వారంటైన్, ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లావ్యాప్తంగా 4 వేల మంది పోలీసులు వివిధ స్థాయిల్లో విధులు నిర్వహిస్తున్నారు. మూడు విడతల లాక్డౌన్లో విధులు నిర్వహించిన పోలీ సులకు ఇప్పుడు వైరస్ సోకుతుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. జిల్లాలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 19 మంది పోలీసులకు ఇప్పటి దాకా కొవిడ్ సోకింది. అలాగే విజయవాడ బందోబస్తుకు వెళ్లిన కాకినాడ ఏపీఎస్పీ పోలీ సులు 78 మంది వైరస్ బారినపడ్డారు. ఇక కాకినాడ నగరంలోని వేర్వేరు పోలీసు స్టేషన్ల లో పనిచేస్తున్న వారు పాజిటివ్ రావడంతో ఐసోలేషన్లో చేరారు. కాంటాక్టు పర్సన్లు క్వారంటైన్ సెంటర్లలో ఉన్నారు. తాజాగా ఒక ఎస్హెచ్వో, డీఎస్పీ కొవిడ్ బారిన పడడం, వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ వ్యక్తులను గుర్తించడంలో వైద్యులు నిమగ్నమయ్యారు. వీరి ఫలితాలపై టెన్షన్ నెలకొంది.