జిల్లాలో 75శాతం కొవిడ్ వ్యాక్సినేషన్
ABN , First Publish Date - 2022-05-20T05:48:54+05:30 IST
జిల్లాలో 75 శాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేశామని, త్వరలో వందశాతం పూర్తికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు డీఎంహెచ్ఓ నాగరాజు తెలిపారు.
వందశాతం పూర్తికి చర్యలు : డీఎంహెచ్వో
ఎర్రగుంట్ల, మే 19: జిల్లాలో 75 శాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేశామని, త్వరలో వందశాతం పూర్తికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు డీఎంహెచ్ఓ నాగరాజు తెలిపారు. గురువారం ఆయన ఎర్రగుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. పీహెచ్సీలోని స్టోర్రూంను తనిఖీ చేసి వస్తువులు సక్రమంగా వుంచాలని ఆదేశించారు. మందుల కొరత, అలాగే మందులు నిల్వపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. మరుగుదొడ్లను పరిశీలించి శుభ్రంగా ఉంచాలన్నారు. ల్యాబ్ను పరిశీలించి, ఇక్కడ ఏఏ వాటికి టెస్టులు చేసేది బోర్డులు పెట్టాలన్నారు. అనంతరం ఆపరేషన్ థియేటర్లో బాలింత ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఎన్నో కాన్పు అని అడుగగా, నాల్గోకాన్పు అని తెలపగా ఇకపై ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు. అనంతరం రోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 25న నేషనల్ క్వాలిటీ అష్యురెన్స్ కమిటీ జిల్లాలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం అన్ని పిహెచ్సీలను సందర్శిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రగుంట్ల అర్బన్ హెల్త్సెంటర్లో వైద్యుడు లేరనే విషయం ఆయన దృష్టికి తీసుకురాగా.. అక్కడికి పీహెచ్సీ నుంచే డిప్యుటేషన్ చేయాల్సి వుందన్నారు. ఈవిషయాన్ని కమిషనర్కు రాసినట్లు తెలిపారు. అయితే ఇక్కడ ఇద్దరే ఉన్నందున అక్కడికి పంపలేకపోతున్నట్లు వివరించారు. ఎర్రగుంట్ల పీహెచ్సీ 24గంటల ఆసుపత్రిగా మారిందని, మరో వైద్యుడిని నియమించవచ్చు కదా అని అడుగగా అది ప్రభుత్వ పరిధిలో ఉందన్నారు. జిల్లాలో డాక్టర్స్ కొరతపై ప్రశ్నించగా డాక్టర్ల కొరత లేదన్నారు. కార్యక్రమంలో డిప్యుటీ డీఎంహెచ్వో ఉమామహేశ్వరరావు, పిహెచ్సీ వైద్యులు క్రిష్ణచైతన్య, పద్మావతి, సూపర్వైజర్ ఓబులేసు, సిబ్బంది పాల్గొన్నారు.