7కోట్ల గ్రామీణ గడపలకు కుళాయిలు
ABN , First Publish Date - 2022-08-20T06:41:02+05:30 IST
‘‘ప్రభుత్వాన్ని నిర్మించడం తేలికే. దేశ నిర్మాణమే అతి కష్టమైన పని. గత ఎనిమిదేళ్లుగా ఈ కష్టమైన పనిని బీజేపీ ఎంచుకుని పని చేస్తోంది.
లక్షకు చేరిన ఓటీఎస్ గ్రామాల సంఖ్య
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడి
న్యూఢిల్లీ, ఆగస్టు 19: ‘‘ప్రభుత్వాన్ని నిర్మించడం తేలికే. దేశ నిర్మాణమే అతి కష్టమైన పని. గత ఎనిమిదేళ్లుగా ఈ కష్టమైన పనిని బీజేపీ ఎంచుకుని పని చేస్తోంది. ఇప్పటి, రేపటి సవాళ్లను సైతం ఎదుర్కొంటూ ముందుకు వెళుతోంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ భావన లేనివారికి దేశసమస్యలూ పట్టవు అంటూ విపక్షాలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం గోవా రాజధాని పణజిలో ‘జల్ జీవన్ మిషన్’ నిర్వహించిన ‘హర్ ఘర్ జల్’ కార్యక్రమంలో ఆయన వీడియో లింక్ ద్వారా పాల్గొన్నారు. ప్రపంచమంతా నీటికోసం కటకటలాడుతుండగా, జలభద్రతను సాధించే లక్ష్యంతో ‘వికసిత భారత్’ ప్రణాళికకు రూపకల్పన చేశామన్నారు.
ఇందులోభాగంగా గ్రామీణ భారతంలో గత మూడేళ్లలోనే ఏడు కోట్ల కుటుంబాలకు కుళాయిల ద్వారా నీరు అందించగలిగామని తెలిపారు. అమృత్కాల్లో సాధించిన మూడు గొప్ప మైలురాళ్లలో ఇదీ ఒకటని ఆయన చెప్పుకొచ్చారు. బహిరంగ మలమూత్ర విసర్జన రహిత (ఓడీఎస్) గ్రామాల సంఖ్య దేశవ్యాప్తంగా లక్షకు చేరుకుందని చెప్పారు.