Gurugram: వ్యక్తిని కొట్టిచంపిన ఏడుగురి అరెస్ట్
ABN , First Publish Date - 2022-05-05T22:07:44+05:30 IST
ఓ ఆటో డ్రైవర్ను కొట్టి చంపిన కేసులో ఏడుగురు నిందితులను గురుగ్రామ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బుల విషయంలో
గురుగ్రామ్: ఓ ఆటో డ్రైవర్ను కొట్టి చంపిన కేసులో ఏడుగురు నిందితులను గురుగ్రామ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బుల విషయంలో డ్రైవర్ సోదరుడు, అరెస్ట్ అయిన నిందితుల్లో ఒకరికి మధ్య వివాదం జరిగింది. ఇది కాస్తా ముదరడంతో 10-15 మంది ఆటో డ్రైవర్ సుమిత్ సోలంకిని సోమవారం రాత్రి కొట్టిచంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను విశాల్ అలియాస్ విక్కీ, రాహుల్ అలియాస్ ఠాకూర్, నితీశ్ అలియాస్ ఆకాశ్, అన్షుల్, అనుభవ్ అలియాస్ గుడ్డు, సోను కుమార్, హిమాన్షులుగా గుర్తించారు. వారి నుంచి ఓ మోటార్ సైకిల్, స్కూటర్, బాధితుడిని కొట్టి చంపేందుకు ఉపయోగించిన కర్రలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తమ నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ఇతర నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.
బాధితుడు సోలంకి సోదరుడు రోహిత్కు, ఈ కేసులో ప్రధాన నిందితుడైన విశాల్కు మధ్య రూ. 1.50 లక్షల విషయంలో గొడలు జరుగుతున్నట్టు పోలీసులు తెలిపారు. బాధితుడికి, నిందితుడికి మధ్య ముందే పరిచయం ఉందని, ఓ వివాహం సమయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. నిందితులు తొలుత రోహిత్పైన, ఆ తర్వాత సుమిత్పైన దాడిచేసినట్టు ఏసీపీ (క్రైమ్) ప్రీత్పాల్ సంగ్వాన్ తెలిపారు.
రోహిత్, తన సోదరుడు సుమిత్తో కలిసి సెక్టార్-9లో జరిగిన ఓ వివాహానికి హాజరయ్యాడు. టెంట్ వెనక దాక్కున్న నిందితులు రోహిత్ను పట్టుకుని చావబాదారు. అయితే, వారి బారి నుంచి రోహిత్ ఎలాగోలా తప్పించుకున్నాడు. అప్పుడు నిందితులు అతడి సోదరుడు సుమిత్ను పట్టుకుని తీవ్రంగా కొట్టడంతో అతడు చనిపోయినట్టు ఏసీపీ తెలిపారు.