వ్యాక్సినేషన్ పూర్తయిన 66 మంది మెడికల్ కాలేజీ విద్యార్థులకు కరోనా
ABN , First Publish Date - 2021-11-25T23:07:21+05:30 IST
ఎస్డీఎం మెడికల్ సైన్స్ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమం అనంతరం 400 మంది విద్యార్థుల్లో 300 మందికి పరీక్షలు
బెంగళూరు: వ్యాక్సినేషన్ పూర్తయిన 66 మంది మెడికల్ కళాశాల విద్యార్థులు కరోనా బారినపడ్డారు. కర్ణాటకలోని ధర్వాడ్లో జరిగిందీ ఘటన. ఎస్డీఎం మెడికల్ సైన్స్ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమం అనంతరం 400 మంది విద్యార్థుల్లో 300 మందికి పరీక్షలు నిర్వహించగా 66 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. అప్రమత్తమైన జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు కాలేజీకి చెందిన రెండు హాస్టళ్లను మూసివేశారు. భౌతిక క్లాసులను నిషేధించారు.
వైరస్ బారినపడిన విద్యార్థులందరూ టీకా రెండు డోసులూ తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారిని క్వారంటైన్లో ఉంచినట్టు ధర్వాడ్ డిప్యూటీ కమిషనర్ నితేశ్ పాటిల్ తెలిపారు. వారికి హాస్టల్లోనే చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. కాలేజీలో ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలోనే వారికి వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్లను గుర్తించామని, పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించినట్టు చెప్పారు. కరోనా సోకిన కొందరు దగ్గు, జ్వరంతో బాధపడుతుండగా, మిగతా వారిలో ప్రస్తుతానికి ఎలాంటి లక్షణాలు లేవని తెలిపారు.