ఇంటర్ ఫలితాల్లో 60 శాతం ఉత్తీర్ణత
ABN , First Publish Date - 2022-06-29T06:17:04+05:30 IST
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో జోగుళాంబ గద్వాల జిల్లా 60 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 28వ స్థానంలో నిలిచింది.
- రాష్ట్రంలో జోగుళాంబ గద్వాల జిల్లాకు 28వ స్థానం
- వృత్తి విద్యలో రాష్ట్ర సగటు దాటిన ఉత్తీర్ణత శాతం
గద్వాల టౌన్, జూన్ 28 : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో జోగుళాంబ గద్వాల జిల్లా 60 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 28వ స్థానంలో నిలిచింది. ప్రథమ సంవత్సరంలో 55శాతం ఉత్తీర్ణతతో 27వ స్థానాన్ని దక్కించుకుంది. మంగళవారం వెల్లడించిన ఫలితాల్లో వృత్తివిద్య కోర్సుల్లో జిల్లా విద్యార్థులు రాష్ట్ర సగటు ఉత్తీర్ణత శాతాన్ని అధిగమించారు. ఏప్రిల్లో నిర్వహించిన ద్వితీయ ఇంటర్ పరీక్షలకు జనరల్ విభాగంలో 3,405 మంది విద్యార్థులు హాజరుకాగా, 2,059 (60 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో 3,723 మందికి గాను 2,058 (55శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. వృత్తి విద్య కోర్సుకు సంబంధించి ద్వితీయ సంవత్సరంలో 499 మందికి 312 మంది (62 శాతం) ఉత్తీర్ణులై, రాష్ట్ర ఉత్తీర్ణతా శాతాన్ని (60 శాతం) అధిగమించారు. ప్రథమ సంవత్సరంలో 663 మందికి గాను 360మంది (55 శాతం) (రాష్ట్ర సగటు 51 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వృత్తి విద్య కోర్సు రెండు సంవత్సరాల ఫలితాల్లో జోగుళాంబ గద్వాల జిల్లాకు 18వ స్థానం దక్కడం విశేషం.
బాలికలదే పైచేయి
జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు. జనరల్ విభాగం ప్రథమ సంవత్సరంలో బాలుర ఉత్తీర్ణత శాతం 39 కాగా, బాలికలు 69 శాతం ఉత్తీర్ణుల య్యా రు. ద్వితీయ సంవత్సరంలో బాలుర ఉత్తీర్ణత శాతం 49 కాగా, బాలికలు 72 శాతం మంది ఉత్తీర్ణుల య్యారు. వృత్తివిద్యా కోర్సులో బాలురు ప్రథ మ సంవత్సరంలో 37 శాతం, ద్వితీయ సంవత్సరంలో 49 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, బాలికలు ప్రథమ సంవత్సరంలో 70 శాతం, ద్వితీయ సంవత్సరంలో 77 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.