అరవై లక్షల వాహనాలు వెనక్కు.. అమెరికా చరిత్రలో అతిపెద్ద రీకాల్...

ABN , First Publish Date - 2020-11-25T02:27:29+05:30 IST

అమెరికా జనరల్ మోటార్స్(జీఎం) సంస్థ... దాదాపు 60 లక్షల పెద్ద పికప్ ట్రక్కులు, ఎస్‌యూవీలను వెనక్కు తెప్పించుకోనుంది. ప్రమాదకర తకాటా ఎయిర్‌బ్యాగ్ ఇన్‌ప్లేటర్లు వీటి అమర్చారు.

అరవై లక్షల వాహనాలు వెనక్కు.. అమెరికా చరిత్రలో అతిపెద్ద రీకాల్...

డెట్రాయిట్ : అమెరికా జనరల్ మోటార్స్(జీఎం) సంస్థ... దాదాపు 60 లక్షల పెద్ద పికప్ ట్రక్కులు, ఎస్‌యూవీలను వెనక్కు తెప్పించుకోనుంది.  ప్రమాదకర తకాటా ఎయిర్‌బ్యాగ్ ఇన్‌ప్లేటర్లు వీటి అమర్చారు. ఈ కార్లను వెనక్కు పిలిపించాలని జనరల్ మోటార్స్‌ను అమెరికాలోని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్(ఎన్‌హెచ్‌డబ్ల్యూటీఎస్‌ఏ) ఆదేశాలు జారీ చేసింది. వాటికి మరమ్మతులు చేసిన తర్వాత తిరిగి యజమానులకు అప్పగించాలని సూచించింది. వీటికి దాదాపు రూ. 9 వేల కోట్ల మేరకు ఖర్చయ్యే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.


ఎన్‌హెచ్‌డబ్ల్యూఎస్‌ఏ నిర్ణయం నేపధ్యంలో వాహన తయారీదారులపై సుమారు 1.2 బిలియన్ డాలర్ల మేర భారం పడనుంది. ఈ ఏడాది కంపెనీ ఆదాయంలో ఇది మూడోవంతు. రీకాల్‌ను తప్పించుకోవడం కోసం జీఎం 2016 నుండి నాలుగుసార్లు పిటిషన్లు వేసింది. 


కాగా... ఎయిర్‌బ్యాగ్ ఇన్‌ఫ్లేటర్లు సురక్షితంగా ఉన్నాయని పరీక్షల్లో తేలిందని జీఎం మోటార్స్ పేర్కొంది. అయితే వీటిని కొనుగోలు చేసిన యజమానులు మాత్రం తమ భద్రత కంటే లాభాల కోసమే కంపెనీ చూసిందని ఆరోపిస్తూ వచ్చారు.


ఇలా ప్రమాదకరం...

తకాటా ఎయిర్ బ్యాగ్ ఇన్‌ఫ్లేటర్ కారణంగా అమెరికా చరిత్రలో అతిపెద్ద ఆటో(సిరీస్) రీకాల్స్ చోటు చేసుకున్నాయని తెలిపింది. దాదాపు 63 మిలియన్ల ఇన్‌ఫ్లేటర్స్‌ను రీకాల్ చేయనున్నారు. వాహనాలు ఢీకొన్నప్పుడు, చిన్నపాటి పేలుడు జరిగి ఎయిర్ బ్యాగ్స్ గాలితో నిండటానికి అనువుగా అమ్మోనియం నైట్రేట్‌ను తకాటా ఎయిర్ బ్యాంక్ ఇన్‌ఫ్లేటర్లలో వాడుతున్నట్లు జీఎం మోటార్స్ పేర్కొంది. అయితే... ఈ రసాయన పదార్థం వేడికి, తేమకు బహిర్గతమైనపక్షంలో అధిక శక్తితో పేలుతోందని, ఈ క్రమంలో ప్రమాదాలు చోటు చేసుకొని ప్రాణాలు పోతున్నాయని యజమానులు చెబుతున్నారు.


అందుకే వెనక్కు... 

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 27 మంది ఇలా ప్రాణాలు కోల్పోగా, ఇందులో 18 మంది ఒక్క అమెరికాలోనే చనిపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తకాటా ఎయిర్ బ్యాగ్ ఇన్‌ఫ్లేటర్లు కలిగిన జీఎం ట్రక్కులు, ఎస్‌యూవీలను వెనక్కు పిలిపించి, వాటిని సరి చేసి యజమానులకు అందించాలంటూ కంపెనీని టూ కంపెనీని ఎన్‌హెచ్‌డబ్ల్యూటీఎస్‌ఏ ఆదేశించింది.

Updated Date - 2020-11-25T02:27:29+05:30 IST