పోలీస్ స్టేషన్పై దాడి: ఆరుగురు పోలీసులకు గాయాలు
ABN , First Publish Date - 2021-05-16T00:39:39+05:30 IST
పోలీస్ స్టేషన్పై దాడి: ఆరుగురు పోలీసులకు గాయాలు
అగర్తలా: ఒక పోలీస్ స్టేషన్పై నిషేధిత నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఎన్ఎల్ఎఫ్టీ) సభ్యులు దాడికి పాల్పడడంతో ఆరుగురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో పాటు మూడు పోలీసు వాహనాలను సైతం ధ్వంసం చేశారు. ఎన్ఎల్ఎఫ్టీకి చెందిన ముగ్గురు సభ్యులను త్రిపుర రాష్ట్రంలోని ధలాయి జిల్లాకు చెందిన గంగానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఎన్ఎల్ఎఫ్టీ సానుభూతిపరులు ఒక బృందంగా శుక్రవారం సరదు పోలీస్ స్టేషన్కు చేరుకుని స్టేషన్పై పోలీసులపైకి దాడికి దిగారు. రాళ్లు, కర్రలతో పోలీసులపైకి విరుచుకుపడ్డారు.
ఈ విషయమై గంగాధర్ పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారి మృణాల్ కంతి రీంగ్ మాట్లాడుతూ ‘‘ఎన్ఎల్ఎఫ్టీకి చెందిన ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసిన అనంతరం ఒక పెద్ద బృందం మా పోలీలస్ స్టేషన్పైకి దాడికి పాల్పడింది. అరెస్ట్ చేసిన వ్యక్తులను విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్లోకి అడుగుపెట్టారు. వారిని గమనించేలోపే పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి ప్రారంభమైంది. ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. మూడు పోలీసు వాహనాలు, ఒక బస్సు, అధికారుల వ్యక్తిగత వాహనాలను ధ్వంసం చేశారు. గాయపడ్డ పోలీసులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు’’ అని తెలిపారు.