అనుమానాస్పద స్థితిలో ఆరు నెమళ్ల మృతి

ABN , First Publish Date - 2022-09-27T05:23:13+05:30 IST

రామకుప్పం మండలం బందార్లపల్లె పంచాయతీ లక్ష్మీపురం సమీపంలో పొదల్లో ఆరు నెమళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి.

అనుమానాస్పద స్థితిలో ఆరు నెమళ్ల మృతి
చనిపోయిన నెమళ్లను పరిశీలిస్తున్న డీఎఫ్వో చైతన్యకుమార్‌రెడ్డి

ఒకరిని అదుపులోకి తీసుకున్న అటవీశాఖ అధికారులు


రామకుప్పం, సెప్టెంబరు 26 రామకుప్పం మండలం బందార్లపల్లె  పంచాయతీ లక్ష్మీపురం సమీపంలో పొదల్లో ఆరు నెమళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. కుప్పం అటవీ క్షేత్రాధికారి మదన్‌మోహన్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. బందార్లపల్లె పంచాయతీ గెర్నిపల్లెకు చెందిన శ్రీరాములుకు, లక్ష్మీపురం సమీపంలో పొలాలున్నాయి. సోమవారం సాయంత్రం ఆయన పొలం పక్కన గల చెట్ల పొదల్లో ఆరు నెమళ్లు మృతిచెంది ఉండగా, స్థానికులు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. కుప్పం అటవీ  క్షేత్రాధికారి మదన్‌మోహన్‌రెడ్డి, ననియాల అటవీ విభాగాధికారి బాబుప్రసాద్‌  సిబ్బందితో అక్కడికి చేరుకుని మృతి చెందిన నెమళ్లను ననియాల ఎలిఫెంట్‌ క్యాంపునకు తరలించారు. పశువైద్యాధికారులతో వాటికి పోస్టుమార్టం నిర్వహించి దహనం చేశారు. నెమళ్ల మృతికి కారణాలు తెలుసుకునే నిమిత్తం వాటి కళేబరాల నుంచి సేకరించిన నమూనాలను తిరుపతి పశువైద్య విశ్వవిద్యాలయానికి పంపినట్టు అధికారులు తెలిపారు. నెమళ్ల శరీరాలపై ఎటువంటి గాయాలు లేవని, అనుమానాస్పద కేసు నమోదు చేశామన్నారు. పొదల పక్కనున్న పొలం యజమాని శ్రీరాములును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. చనిపోయిన నెమళ్లను ననియాల ఎలిఫెంట్‌ క్యాంపులో డీఎ్‌ఫఓ చైతన్యకుమార్‌రెడ్డి పరిశీలించారు. 

Updated Date - 2022-09-27T05:23:13+05:30 IST