పేదలకు ఇక నుంచి 6 కిలోల బియ్యం!

ABN , First Publish Date - 2020-11-29T06:12:36+05:30 IST

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు 8 నెలలుగా ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యం ప్యాకేజీ ఈ నెలతో ముగుస్తోంది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో వినియోగదారుడికి 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయగా, జూలై నుంచి నవంబరు వరకు 10 కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేశారు

పేదలకు ఇక నుంచి 6 కిలోల బియ్యం!

డిసెంబరు నుంచి రూపాయికి కిలో.. 

పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు


హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు 8 నెలలుగా ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యం ప్యాకేజీ ఈ నెలతో ముగుస్తోంది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో వినియోగదారుడికి 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయగా, జూలై నుంచి నవంబరు వరకు 10 కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేశారు. కొవిడ్‌-19 ప్యాకేజీని నవంబరుతో సరిపెట్టి డిసెంబరు నుంచి పాత పద్ధతిలోనే బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ వి.అనిల్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నిత్యావసర సరుకులు, స్కేల్‌ ఆఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌, వినియోగదారుడు చెల్లించాల్సిన ధరల పట్టికను విడుదల చేశారు. ఆహార భద్రత కార్డులున్న లబ్ధిదారులకు 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తారు. కార్డుపై ఉన్న లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం ఇస్తారు. కిలోకు రూపాయి చెల్లించాల్సి ఉంటుంది. అంత్యోదయ కార్డున్న వారికి ఒక్కో కార్డుపై 35 కిలోల బియ్యం ఇస్తారు. ఈ బియ్యానికి కూడా కిలోకు రూపాయి వసూలు చేస్తారు. అన్నపూర్ణ కార్డులున్న వారికి ఒక్కో కార్డుపై 10 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తారు. 


2.97 కోట్ల మంది లబ్ధిదారులు

రాష్ట్రంలో 87.55 లక్షల ఆహార భద్రత కార్డులుండగా.. 2.97 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. ఇందులో 53.30 లక్షల మందికి జాతీయ ఆహార భద్రత కార్డులున్నాయి. వీరికి 5 కిలోల చొప్పున కేంద్రం నుంచి బియ్యం వస్తాయి. ఒక కిలో రాష్ట్ర ప్రభుత్వం కలిపి నెలకు 6 కిలోలుపంపిణీ చేస్తుంది. మిగిలిన 34.25 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆహార భద్రత కార్డులున్నాయి. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 87.55 లక్షల ఆహార భద్రతా కార్డుల లబ్ధిదారులకు డిసెంబరు నుంచి రూపాయికి కిలో చొప్పున 6 కిలోల బియ్యం ఇస్తారు.


కొవిడ్‌-19 ప్రభావంతో గత మార్చి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు మూతపడ్డాయి. గతంలో మధ్యాహ్న భోజన పథకం కోసం పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లకు కేటాయించిన ‘సన్న బియ్యం’.. 80 వేల మెట్రిక్‌ టన్నులున్నాయి. 9 నెలలుగా వృథాగా పడి ఉన్న నేపథ్యంలో వీటిని ఆహారభద్రత కార్డులున్న వారికి పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం.

Updated Date - 2020-11-29T06:12:36+05:30 IST