ఇనుప చువ్వతో వాతలు పెట్టిన తల్లి.. 5 నెలల చిన్నారి మృతి!

ABN , First Publish Date - 2021-07-11T01:00:53+05:30 IST

వైద్యచికిత్స పేరిట ఓ మహిళ తన 5 నెలల కూతురికి ఇనుప చువ్వతో వాతలు పెట్టడంతో చిన్నారి మృతి చెందింది. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో గురువారం ఈ దారుణం జరిగింది.

ఇనుప చువ్వతో వాతలు పెట్టిన తల్లి..  5 నెలల చిన్నారి మృతి!

భిల్వారా(రాజస్థాన్): చికిత్స పేరిట ఓ మహిళ తన 5 నెలల కూతురికి ఇనుప చువ్వతో వాతలు పెట్టడంతో చిన్నారి మృతి చెందింది. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో గురువారం ఈ దారుణం జరిగింది. కొంతకాలంగా ఆ చిన్నారి అనారోగ్యంతో బాధపడుతోందని స్థానిక పోలీసులు తెలిపారు. బాలిక పాలు తాగకుండా, నిరంతరం ఏడుస్తూ ఉండటంతో ఆమె కడుపులో ఏదో సమస్య ఉందని బాలిక తల్లి లాహిరి భావించింది. పరిష్కారం కోసమని స్థానికంగా ఉన్న ఓ తాంత్రికుణ్ణి సంప్రదించేందుకు ప్రయత్నించింది. అయితే..అతడు వేరే ఊరు వెళ్లడంతో లాహిరి తనే స్వయంగా చికిత్స చేసేందుకు ఉపక్రమించింది. కాల్చిన ఇనుప చువ్వతో వాతలు పెడితే కడుపులో కుళ్లు పోతుందని భావించిన ఆమె ఆ చిన్నారికి వాతలు పెట్టింది. ఫలితంగా శిశువు పరిస్థితి వేగంగా దిగజారడంతో ఆమెను పెద్దాస్పత్రికి తరలించాల్సి వచ్చింది. అక్కడ వైద్యులు చిన్నారిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయినా..అప్పటికే పరిస్థితి చేయిదాటిపోవడంతో ఆ శిశువు కన్నుమూసింది. వైద్యులు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు నిందితురాలిపై కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-07-11T01:00:53+05:30 IST