అక్టోబరులో 5జీ సేవలు షురూ

ABN , First Publish Date - 2022-07-31T07:04:55+05:30 IST

దేశంలో 5జీ వాణిజ్య సేవలు ఈ ఏడాది అక్టోబరులో ప్రారంభం కావచ్చని టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు.

అక్టోబరులో 5జీ సేవలు షురూ

 టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ 

ముంబై: దేశంలో 5జీ వాణిజ్య సేవలు ఈ ఏడాది అక్టోబరులో ప్రారంభం కావచ్చని టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. ‘‘వేలం ముగిసిన కొద్ది రోజుల్లోనే స్పెక్ట్రమ్‌ కేటాయిస్తాం. అక్టోబరు తొలినాళ్లలోనే 5జీ వాణిజ్య సేవలు ప్రారంభం కావచ్చని అంచనా. ఆ తర్వాత ఏడాది కాలంలోనే దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి రావచ్చ’’ని టెలికాం ఇన్వెస్టర్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి అన్నారు. అంతేకాదు, మిగతా దేశాలతో పోలిస్తే, భారత్‌లోనే సేవలు చాలా త్వరగా ప్రారంభం కానున్నాయని ఆయన పేర్కొన్నారు. 


ఆ రెండు కంపెనీల ఆధిపత్యానికి అవకాశం లేదు: దేశీయ టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ ఆధిపత్యానికి తావు లేదని, గత ఏడా ది సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో ఇండస్ట్రీకి స్థిరత్వం లభించిందని, కంపెనీల మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొందని అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. ప్రభుత్వ రంగ బీఎ్‌సఎన్‌ఎల్‌ టెలికాం సేవల మార్కెట్‌ సమతౌల్యానికి దోహదపడనుందన్నారు. ఈ ఇండస్ట్రీలోకి కొత్త కంపెనీలు ప్రవేశించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 


నేడూ కొనసాగనున్న బిడ్డింగ్‌: 5జీ స్పెక్ట్రమ్‌ వేలం ఐదో రోజు ముగిసేసరికి 30 రౌండ్ల బిడ్డింగ్‌ పూర్తి కాగా.. ఇప్పటివరకు రూ.1,49,966 కోట్ల విలువైన బిడ్లు లభించాయి. ఆదివారం కూడా బిడ్డింగ్‌ కొనసాగనుంది. వేలం ప్రక్రియ పూర్తయ్యాక ఏ కంపెనీకి ఎంత స్పెక్ట్రమ్‌ లభించిందన్న విషయంపై స్పష్టత రానుంది. ఈ వేలం ద్వారా ప్రభుత్వం రూ.4.31 లక్షల కోట్ల విలువైన 72 గిగాహెట్జ్‌ల స్పెకా్ట్రన్ని విక్రయానికి పెట్టింది. 

Updated Date - 2022-07-31T07:04:55+05:30 IST