53 మంది విద్యార్థులకు కోవిడ్, కాలేజీ మూసివేత
ABN , First Publish Date - 2021-12-04T01:18:52+05:30 IST
తొలుత కుంజకంట ప్రాంతంలోని హాస్టల్లో నలుగురు విద్యార్థుల్లో కరోనా పాజిటవ్ ఉండటాన్ని గుర్తించారు. దీంతో తక్కినవారికి కూడా..
ధేన్కనాల్: ఒడిశాలోని థేన్కనాల్ జిల్లాలో 53 మందికి పైగా విద్యార్థుల్లో కరోనా పాజిటివ్ గుర్తించారు. దీంతో వీరు చదువుతున్న సాయికృష రెసిడెన్షియల్ కాలేజీని మున్సిపల్ యంత్రాంగం శుక్రవారం నుంచి నిరవధికంగా మూసేసింది. తొలుత కుంజకంట ప్రాంతంలోని హాస్టల్లో నలుగురు విద్యార్థుల్లో కరోనా పాజిటవ్ ఉండటాన్ని గుర్తించారు. దీంతో తక్కినవారికి కూడా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 33 మందికి పైగా విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలగా, వారిని ఐసొలేషన్కు తరలించారు. అనంతరం మరో 16 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ కావడంతో ఆ సంఖ్య 53కు చేరింది. తగినన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదన్న కారణంగా కాలేజీ చైర్పర్సన్, ప్రిన్సిపాల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు జిల్లా కలెక్టర్ సరోజ్ కుమార్ సేథి తెలిపారు.
కాగా, 50 మందికి పైగా విద్యార్థుల్లో కోవిడ్ కేసులు వెలుగుచూడటంతో కుంజకంట ప్రాంతాన్ని 10 రోజుల పాటు మైక్రో-కంటైన్మెంట్ జోన్గా అధికారులు ప్రకటించారు. సామూహిక కార్యక్రమాలపై ఆంక్షలు ప్రకటించడంతో పాటు నైట్ కర్ఫ్యూ అమల్లోకి తెచ్చారు. మాస్క్లు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి కోవిడ్ ప్రోటోకాల్స్ను తప్పనిసరి చేశారు. కంటైన్మెంట్ జోన్లలో చిన్నా, పెద్దా వ్యాపార సంస్థలన్నింటినీ తక్షణం మూసేయాలని ఆదేశించారు. మందులు, నిత్వావసరాలను మాత్రమే అనుమతిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.