523 నామినేషన్ల ఉపసంహరణ

ABN , First Publish Date - 2021-03-04T06:28:23+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువైన బుధవారం భారీగా ఉపసంహరణలు జరిగాయి.

523 నామినేషన్ల ఉపసంహరణ
తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ చిత్తూరు గాయత్రీ నగర్‌కాలనీ సచివాలయం వద్ద టీడీపీ నేత సందీప్‌కు వివరిస్తున్న వైసీపీ రెబల్‌ అభ్యర్థి రాజేశ్వరి

  

పుంగనూరులో వైసీపీయేతర అభ్యర్థుల నామినేషన్లు మొత్తం విత్‌డ్రా

దాదాపుగా ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణలన్నీ వారి పరోక్షంలోనే!


తిరుపతి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువైన బుధవారం భారీగా ఉపసంహరణలు జరిగాయి. తొలి రోజు 233 నామినేషన్ల ఉపసంహరణ జరగగా బుధవారం 523 నామినేషన్లు విత్‌డ్రా అయ్యాయి. రెండ్రోజుల్లో మొత్తం 756 నామినేషన్లు విత్‌డ్రా అవగా 774 నామినేషన్లు పోటీలో మిగిలాయి. స్థానాల విషయానికొస్తే తిరుపతి, చిత్తూరు నగర కార్పొరేషన్లలో వంద డివిజన్లు, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, నగరి, పుత్తూరు మున్సిపాలిటీలలో 148 వార్డులూ కలిపి మొత్తం 248 స్థానాలుండగా అందులో 129 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 119 స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా వాటిలో 774 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాగా పుంగనూరులోని 31 స్థానాలకు గానూ వైసీపీయేతర అభ్యర్థులంతా పోటీ నుంచీ తప్పుకున్నారు. దీంతో అన్ని స్థానాలూ వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. ఇక్కడ వైసీపీయేతర అభ్యర్థులంతా అధికార పార్టీ నేతల బెదిరింపులతో జడిసి నామినేషన్లు వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తుండగా మిగిలిన నగరాలు, పట్టణాల్లో ప్రతిపక్ష అభ్యర్థులకు తెలియకుండానే, వారి పరోక్షంలోనే వారి నామినేషన్లు విత్‌ డ్రా అయ్యాయి. అభ్యర్థి లేదా వారి ప్రతిపాదకులు మాత్రమే నామినేషన్‌ విత్‌ డ్రా చేయాల్సివుండగా జిల్లాలో ఆ నిబంధన చాలావరకూ అమలు కాలేదు. అభ్యర్థుల పేరిట అధికార పార్టీ నేతలే ఉపసంహరణ పత్రాలను తెచ్చివ్వగా అధికారులు వాటిని ఆమోదించేశారన్న ఆరోపణలు, ఫిర్యాదులున్నాయి. అయితే దీనిపై ప్రతిపక్ష అభ్యర్థులు, నేతల నుంచీ పెద్దగా ప్రతిఘటన లేకపోవడం గమనార్హం. చిత్తూరులో టీడీపీ ఎన్నికల పరిశీలకుడిగా వున్న పార్టీ నేత గురజాల సందీప్‌పై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు.తిరుపతిలో టీడీపీకి చెందిన ఓ మహిళా అభ్యర్థి ఽతనకు తెలియకుండా తన నామినేషన్‌ ఎలా విత్‌ డ్రా చేస్తారంటూ అధికారులను దైర్యంగా నిలదీశారు. తనకు అన్యాయం చేస్తే పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించారు. చివరికి కమిషనర్‌ ఆమెను పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మదనపల్లెలో బీజేపీ, సీపీఐ అభ్యర్థుల నామినేషన్లు విత్‌ డ్రా చేయడంపై ఆయా పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. పలమనేరులో టీడీపీ అభ్యర్థికి తెలియకుండా నామినేషన్‌ ఉపసంహరించారన్న ప్రచారంతో టీడీపీ, వైసీపీ వర్గాలు గొడవ పడ్డాయి.


మున్సిపాలిటీ వార్డులు తొలిరోజు విత్‌డ్రాలు రెండవ రోజు విత్‌డ్రాలు    మిగిలిన నామినేషన్లు

----------------------------------------------------------------------------------------------------------------

తిరుపతి 50 60 28 236

చిత్తూరు 50 90 205 226

మదనపల్లె 35 29 54 97

పుంగనూరు 31 24 20 31

నగరి 29 16 58 83

పుత్తూరు 27   1 134 80

పలమనేరు 26 13 24 16

----------------------------------------------------------------------------------------------------------------

మొత్తం 248 233 523 774



Updated Date - 2021-03-04T06:28:23+05:30 IST