యూఏఈలో చిక్కుకున్న దాదాపు 500 మంది కేరళ వాసులు

ABN , First Publish Date - 2021-05-17T16:12:01+05:30 IST

ఏజెంట్ చెప్పిన మాటలు నమ్మి, ఏడారి దేశం బాటపట్టిన కేరళకు చెందిన 500 మంది నర్సులు ప్రస్తుతం యూఏఈలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమకు సాయం చేయాల్సిందిగా అర్దిస్తున్నారు

యూఏఈలో చిక్కుకున్న దాదాపు 500 మంది కేరళ వాసులు

అబుధాబి: ఏజెంట్ చెప్పిన మాటలు నమ్మి, ఏడారి దేశం బాటపట్టిన కేరళకు చెందిన 500 మంది నర్సులు ప్రస్తుతం యూఏఈలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమకు సాయం చేయాల్సిందిగా అర్దిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ‘కరోనా విజృంభిస్తోంది. యూఏఈలో నర్సుల అవసరం చాలా ఉంది. కేరళకు చెందిన వారికి ప్రాధాన్యం ఇస్తాం. ఆసక్తి ఉన్న వారు సంప్రదించండి’ అనే పత్రికా ప్రకటనను కేరళకు చెందిన కొంత మంది నర్సులు ఎగిరి గంతేశారు. యూఏఈ వెళ్తే మంచి జీవితం పొందొచ్చని ఆశపడ్డారు. సదరు రిక్రూట్‌మెంట్ ఏజెంట్లను సంప్రదించి, ఒక్కొక్కరు దాదాపు రూ.2.30లక్షలు ముట్టజెప్పారు. ఈ క్రమంలో వర్క్ వీసా రావడానికి కొద్ది సమయం పడుతుందని నమ్మబలికిన సదరు ఏజెంట్లు.. వారిని విజిట్ వీసా మీద యూఏఈకి తీసుకెళ్లారు. 



తీరా అక్కడకు వెళ్లిన తర్వాత తాము మోసపోయినట్టు గ్రహించి సదరు నర్సులు షాక్‌కు గురయ్యారు. దిక్కుతోచని పరిస్థితుల్లో యూఏఈలో చిక్కుకున్న దాదాపు 500 మంది నర్సులు తమకు సహాయం చేయాల్సిందిగా కేరళ ముఖ్యమంత్రిని ఓ లేఖ ద్వారా అభ్యర్థించారు. ఈ సందర్భంగా రీన్ రాజన్ (30) మాట్లాడుతూ.. ‘కొచ్చికి చెందిన రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ చేతిలో మోసపోయాం. ఆసుపత్రుల్లో ఉద్యోగాలని చెప్పి మామ్మల్ని ఇక్కడకు పంపించారు. కానీ ఇక్కడకు వచ్చాక మసాజ్ సెంటర్‌లు, కేర్ హోంలలో పని చేయాలి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. నర్సులకు సంబంధించిన విషయం తమ దృష్టికి రాలేదని కేరళ సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. తమకు ఎటువంటి లేఖ అందలేదని స్పష్టం చేసింది. 


Updated Date - 2021-05-17T16:12:01+05:30 IST