50 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధం

ABN , First Publish Date - 2022-08-14T07:52:30+05:30 IST

కేసీఆర్‌ బొమ్మతో ఎన్నికల్లోకి వెళితే గెలవలేమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భయపడుతున్నారని, ఆ పార్టీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ తెలిపారు.

50 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధం

 నయా నిజాం పాలనకు అంతం పలకాలి

ఇదే చివరి ఉద్యమం కావాలి: బండి సంజయ్‌


మోత్కూరు, ఆగస్టు 13: కేసీఆర్‌ బొమ్మతో ఎన్నికల్లోకి వెళితే గెలవలేమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భయపడుతున్నారని, ఆ పార్టీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ తెలిపారు. గతంలో తాను 12మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పానని, ఇప్పుడు ఆ సంఖ్య 50కి చేరిందన్నారు. మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర 11వ రోజు శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో కొనసాగింది. పొడిచేడు గ్రామంలో మలి ఉద్యమంలో తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మోత్కూరు అంబేడ్కర్‌ చౌరస్తాలో సంజయ్‌ మాట్లాడుతూ.. ఉప ఎన్నిక రావాలన్నది కేసీఆర్‌ కోరిక అని, మునుగోడులో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు ఏకమై వచ్చినా బీజేపీ గెలుపును ఆపలేరన్నారు. సీఎం కుర్చీ కోసం కేసీఆర్‌ ఇంట్లో కొడుకు, బిడ్డ, అల్లుడి మధ్య లొల్లి మొదలైందని చెప్పారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నయా నిజాం పాలన సాగుతోందని, ప్రజలు తమ ఆకాంక్షల సాధనకు మరోసారి పోరాడాలని, ఇదే చివరి ఉద్యమం కావాలన్నారు. కేసీఆర్‌ను గద్దె దించడానికి తమ పార్టీ ఉద్యమిస్తోందని, మేధావులు, కళాకారులు, అన్నివర్గాల ప్రజలు తమతో కలిసి రావాలని ఆయన కోరారు. 


ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తా: జీవితరాజశేఖర్‌

బీజేపీ తనకు ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని సినీనటి జీవితరాజశేఖర్‌ అన్నారు. బీజేపీ ప్రజా సంగ్రామ పాదయాత్రలో పాల్గొన్న ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత, అసంతృప్తి ఉందన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం బీజేపీ పాలన రావాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-14T07:52:30+05:30 IST