ప్రసాదం కోసం ఫోన్‌ చేస్తే రూ.50 వేలు మాయం.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-05-15T18:27:40+05:30 IST

ఆన్‌లైన్‌లో దేవుని ప్రసాదం కోసం ఆర్డర్‌ (Online Order) ఇస్తే రాకపోవడంతో..

ప్రసాదం కోసం ఫోన్‌ చేస్తే రూ.50 వేలు మాయం.. అసలేం జరిగిందంటే..

హైదరాబాద్ సిటీ/పంజాగుట్ట : ఆన్‌లైన్‌లో దేవుని ప్రసాదం కోసం ఆర్డర్‌ (Online Order) ఇస్తే రాకపోవడంతో నెట్‌లో కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ కోసం వెతికి, ఫోన్‌ చేయగా వారు చెప్పినట్లు చేయడంతో అకౌంట్‌లో నుంచి ఆగంతుకులు రూ.50 వేలు కాజేసిన సంఘటన పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పంజాగుట్టకు చెందిన బి.ఆరతి గత నెల 4న డెలివరీ డాట్‌ కామ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో కాశీ విశ్వనాథ్‌ ఆలయ ప్రసాదాన్ని ఆర్డర్‌ చేసింది. రావడం ఆలస్యం కావడంతో నెట్‌లో వెతికి కస్టమర్‌ కేర్‌ నెంబర్‌కు ఫోన్‌ చేసింది.


కొద్దిసేపటి తరువాత రెండు నెంబర్ల నుంచి ఆమెకు ఫోన్‌ వచ్చింది. రాహుల్‌ కుమార్‌, పటేల్‌గా వారు పరిచయం చేసుకున్నారు. తాను ప్రసాదాన్ని ఆర్డర్‌ చేసినా రాలేదని ఆమె చెప్పింది. దాంతో వారు చెప్పిన విధంగా ఎనీడెస్క్‌ యాప్‌ను ఫోన్‌లో డౌన్లోడ్‌ చేసుకుంది.కొన్ని నిమిషాల తరువాత ఆమె బ్యాంక్‌ ఖాతాలో నుంచి రూ.50 వేలు డ్రా అయినట్లు సమాచారం వచ్చింది. మోసపోయానని గ్రహించి బాధితురాలు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


మరో ఘటనలో  రూ. 15 వేలు..

మీరు దరఖాస్తు చేసుకున్న క్రెడిట్‌ కార్డ్‌కు సంబంధించి వచ్చే ఓటీపీని చెబితే యాక్సిస్‌ చేస్తామని చెప్పిన ఆగంతుకులు సదరు వ్యక్తి బ్యాంక్‌ ఖాతా నుంచి మూడు దఫాలుగా 17,500 రూపాయలు కాజేశారు. ఈ సంఘటన పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. నిర్మల్‌ జిల్లాకు చెందిన నవీన్‌కుమార్‌ సోమాజిగూడలోని ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ ఏడాఆది ఫిబ్రవరిలో ధని క్రెడిట్‌ కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. 


ఈ క్రమంలో అతనికి కొద్దిరోజుల తర్వాత 982797895962894112490 రెండు ఫోన్‌ నంబర్ల నుంచి ఫోన్‌ వచ్చింది. మీ కార్డ్‌ ప్రాసెస్‌ లో ఉంది. మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీని చెప్పమని ఆగంతకుడు చెప్పాడు. ఓటిపి రాగానే వారికి చెప్పడంతో కొద్దిసేపటి తర్వాత అతని HDFC బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.7 వేలు, యాక్సిస్‌ బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.3 వేలు, క్రెడిట్‌ కార్డ్‌ నుంచి రూ.7,500 ఇలా మొత్తం రూ.17,500 డ్రా అయినట్లు గుర్తించాడు. వెంటనే బ్యాంక్‌ అధికారులకు సమాచారం అందించాడు.  పంజాగుట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-05-15T18:27:40+05:30 IST