శ్రీశైలం ప్రాజెక్ట్‌ పవర్‌ను 50:50 వాడుకోవాలి : పరమేశం

ABN , First Publish Date - 2020-06-05T01:16:03+05:30 IST

ఈ ఏడాది కూడా శ్రీశైలం ప్రాజెక్ట్‌ పవర్‌ను 50:50 వాడుకోవాలని సూచించామని కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్‌ పరమేశం తెలిపారు. ఇరు రాష్ట్రాలకు చెందిన అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాలని

శ్రీశైలం ప్రాజెక్ట్‌ పవర్‌ను 50:50 వాడుకోవాలి : పరమేశం

హైదరాబాద్‌: ఈ ఏడాది కూడా శ్రీశైలం ప్రాజెక్ట్‌ పవర్‌ను 50:50 వాడుకోవాలని సూచించామని కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్‌ పరమేశం తెలిపారు. ఇరు రాష్ట్రాలకు చెందిన అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాలని కోరామని చెప్పారు. ప్రభుత్వం అనుమతితో డీపీఆర్‌లు సమర్పిస్తామని రెండు రాష్ట్రాలు చెప్పాయని పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా 66:34 నిష్పత్తిలో నీటిని పంచుకునేందుకు ఒప్పందం కుదిరిందని, టెలిమెట్రీల ఏర్పాటు కోసం కేఆర్‌ఎంబీకి నిధులు ఇస్తామని రెండు రాష్ట్రాల అంగీకారం తెలిపాయని పరమేశం చెప్పారు.


హైదరాబాద్‌లోని జలసౌధలో బోర్డు చైర్మన్‌ పరమేశం ఆధ్వర్యంలో ఇరు రాష్ర్టాల ఇరిగేషన్‌ శాఖ కార్యదర్శులు, ఈఎన్‌సీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీశైలంలో ఉత్పత్తి అయ్యే జల విద్యుత్తు వాడకంపైనా, బోర్డుకు రెండు రాష్ట్రాలు ఇవ్వాల్సిన నిధులపైనా సమావేశంలో చర్చించనట్లు సమాచారం. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు, బోర్డు సిబ్బంది పోస్టింగులు, బోర్డు వ్యయంపై ఆడిటింగ్‌ నివేదికలపైనా చర్చించినట్లు అధికారులు తెలిపారు. అయితే బోర్డు సమావేశం వాడివేడిగా జరిగింది. మందుగా తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులపై ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీ తరపున ఏపీ ఇరిగేషన్ స్పెషల్ ఛీప్ సెక్రెటరీ ఆదిత్యనాథ్‌ దాస్ వాదనలు విన్పించారు.


రజత్‌కుమార్ వాదన

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కట్టొద్దని రజత్‌కుమార్ తేల్చిచెప్పారు. కృష్ణా నదిపై ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు వచ్చాయని, వాటినే కొనసాగిస్తున్నామని చెప్పారు. విభజన అనంతరం నిర్మిస్తున్న ప్రాజెక్టు కాబట్టి అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉండాల్సిందేనని రజత్‌కుమార్ పేర్కొన్నారు.


ఆదిత్యనాథ్ దాస్‌ వాదన

తెలంగాణ ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ వల్ల ఏపీకి నష్టమని ఆదిత్యనాథ్‌ దాస్ చెప్పారు. ఏపీకి నీటి కేటాయింపులకు అనుగుణంగానే పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు చేపట్టామని తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టుల డిజైన్లు మార్చిందని, అందుకే తెలంగాణ ప్రాజెక్టులను కొత్తవిగా పరిగణించాలన్నారు. ఉమ్మడి ఏపీలో జరిగిన ప్రతిపాదనలకు... వీటికి పొంతనలేదని, తెలంగాణ ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ వల్ల ఏపీకి నష్టమని ఆదిత్యనాథ్‌ దాస్ పేర్కొన్నారు.

Updated Date - 2020-06-05T01:16:03+05:30 IST