5 కోట్లు దాటాయ్..
ABN , First Publish Date - 2022-07-31T07:07:07+05:30 IST
ఈ నెల 30వ తేదీ (శనివారం) రాత్రి 8.36 గంటల వరకు దాఖలైన ఐటీ రిటర్నులు 5 కోట్లు దాటాయని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది.
శనివారం నాటికి దాఖలైన ఐటీ రిటర్నులు
నేటితో ముగియనున్న గడువు
న్యూఢిల్లీ: ఈ నెల 30వ తేదీ (శనివారం) రాత్రి 8.36 గంటల వరకు దాఖలైన ఐటీ రిటర్నులు 5 కోట్లు దాటాయని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. ప్రస్తుత మదింపు సంవత్సరానికి (2022-23) రిటర్నుల దాఖలు గడువు ఈ నెల 31 (ఆదివారం)తో ముగియనుంది. నిర్దేశిత గడువులోగా రిటర్నులు సమర్పించాలని ఐటీ శాఖ ప్రజలను కోరింది. గత మదింపు సంవత్సరానికి (2021-22) దాదాపు 5.89 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయి. అయితే, కరోనా సంక్షోభం దృష్ట్యా గతసారి ఫైలింగ్ గడువును 2021 డిసెంబరు 31 వరకు పొడిగించారు. ఈసారి కూడా గడువును పెంచాలంటూ కొన్ని వర్గాల నుంచి డిమాండ్ వ్యక్తమవుతున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు సుముఖంగా లేదు. ఈ విషయంపై ఐటీ అధికార వర్గాలు స్పందిస్తూ.. గడువు ముగిసేవరకు రిటర్నుల ఫైలింగ్ సజావుగా జరిగేలా చూడటంపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించడం జరిగిందని, అంతకు మించి వేరే ఆలోచనలేమీ లేవన్నారు.
ఆదివారమూ సహాయ కేంద్రాలు తెరిచే ఉంటాయ్..
ఐటీ రిటర్నుల ఫైలింగ్కు చివరి రోజైన ఆదివారం కూడా ఆయకార్ సేవా కేంద్రాలు లేదా ఇన్కమ్ ట్యాక్స్ హెల్ప్ సెంటర్లు తెరిచే ఉంటాయని ఐటీ శాఖ సర్వోన్నత నిర్ణయాధికార మండలి సీబీడీటీ తెలిపింది. అంతేకాదు, ఐటీ రిటర్నుల స్వీకరించేందుకు అవసరమైన చోట అదనపు కౌంటర్లను సైతం ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.
గడువు తప్పితే..?
అదనపు మూల్యం చెల్లించుకోవాల్సిందే..
నష్టాల క్యారీ ఫార్వార్డ్ అవకాశాన్నీ కోల్పోతారు..
ఈ జూలై 31 గడువు తప్పినప్పటికీ, పన్ను చెల్లింపుదారులు డిసెంబరు 31లోగా రిటర్నులు ఫైల్ చేయవచ్చు. కానీ, ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రూ.5 లక్షల వరకు వార్షికాదాయం కలిగిన వారు రూ.1,000, అంతకు మించి ఆదాయం కలిగిన వారు రూ.5,000 పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. అయితే, వార్షికాదాయం రూ.2.5 లక్షలకు మించని వారికి మాత్రం ఆలస్య రుసుము నుంచి మినహాయింపు లభిస్తుంది. ఐటీ చట్టం 1961లోని సెక్షన్ 234ఏ ప్రకారం.. గడువు తేదీ ముగిశాక రిటర్నులు దాఖలు చేసే వారు పన్ను బకాయిపై ఒక శాతం చొప్పున వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఏదైనా నెలలో 5 లేదా ఆ తర్వాత తేదీలో పన్ను డిపాజిట్ చేస్తే, ఆ నెల మొత్తానికి వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, జూలై 31లోగా రిటర్నులు ఫైల్ చేయని వారు ప్రస్తుత ఏడాది నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకోగలిగే అవకాశాన్నీ కోల్పోతారు.