గత 5 ఏళ్లలో ఎంతమంది విదేశీయులు భారత పౌరసత్వం తీసుకున్నారంటే..?
ABN , First Publish Date - 2022-02-09T19:06:23+05:30 IST
గడిచిన ఐదేళ్లలో ఎంతమంది విదేశీయులు భారత పౌరసత్వం తీసుకున్నారనే ప్రశ్నకు మంగళవారం కేంద్ర హోం వ్యవహారాల మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో లిఖితపూర్వంగా సమాధానం ఇచ్చారు.
గడిచిన ఐదేళ్లలో 4,844 మంది విదేశీయులకు భారత పౌరసత్వం
న్యూఢిల్లీ: గడిచిన ఐదేళ్లలో ఎంతమంది విదేశీయులు భారత పౌరసత్వం తీసుకున్నారనే ప్రశ్నకు మంగళవారం కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. భారతీయ పౌరసత్వ చట్టం 1955ను అనుసరించి 2016 నుంచి 2021 వరకు మొత్తం 4,844 మంది విదేశీయులకు భారత పౌరసత్వం ఇచ్చామని మంత్రి వెల్లడించారు. వీటిలో 2021లో అత్యధికంగా 1,773 మంది విదేశీయులు భారత పౌరసత్వం పొందినట్లు తెలిపారు. అలాగే 2020లో 639 మంది, 2019లో 987 మంది, 2018లో 628 మంది, 2017లో 817 మందికి భారత పౌరసత్వం ఇచ్చినట్టు మంత్రి తెలియజేశారు.