484 శ్రీగంధం దుంగల పట్టివేత
ABN , First Publish Date - 2022-01-15T04:51:04+05:30 IST
అక్రమంగా రవాణా చేస్తున్న 484 శ్రీ గంధం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసి మూడు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
8మంది నిందితుల అరెస్టు
వాహనాలు స్వాధీనం
సూళ్లూరుపేట, జనవరి 14 : అక్రమంగా రవాణా చేస్తున్న 484 శ్రీ గంధం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసి మూడు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గూడూరు డీఎస్పీ రాజగోపాల్రెడ్డి శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆ వివరాలు వెల్లడించారు. ‘కృష్ణపట్నం నుంచి చెన్నైకు 484 దుంగలను తరలిస్తున్నారని సూళ్లూరుపేట సీఐ వెంకటేశ్వర్లురెడ్డి, తడ, శ్రీహరికోట ఎస్ఐలు శ్రీనివాసరెడ్డి, రోజాలతలకు ముందస్తు సమాచారం అందింది. దాంతో వారు జాతీయ రహదారిపై కాపుకాచారు. రెండు పైలెట్ కార్లను, శ్రీగంధ దుంగలను తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. దగదర్తి మండలం కట్టుబడిపాళేనికి చెందిన తుపాకుల మహేంద్ర, అనంతసాగర మండలం రేవూరుకు చెందిన ఎం. మురళీకృష్ణ, దగదర్తి గ్రామానికి చెందిన యు. రామచంద్రయ్య, నెల్లూరు బీవీ నగర్కు చెందిన కె. మాలకొండయ్య, గూడూరు మండలం మిట్ట ఆత్మకూరుకు చెందిన కె. పెంచలయ్య, వెంకటగిరి మండలం సిద్ధగుంటకు చెందిన కె. వెంకటరమణయ్య, పొదలకూరు గ్రామానికి చెందిన ఎన్. మణి, రాపూరు మండలం గోనుపల్లి గ్రామానికి చెందిన వెలుగు అంకయ్య అనే నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు’ అని వెల్లడించారు. ఈ కేసులో పాల్గొన్న పోలీసులను ఆయన అభినందించారు.