లాక్డౌన్ నిబంధనల అతిక్రమణ.. 47మంది గృహనిర్బంధం
ABN , First Publish Date - 2020-04-11T00:41:24+05:30 IST
కరోనా వైరస్ను నియంత్రించడానికి ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటిస్తే.. కొందరు అత్యుత్సాహపరులు మాత్రం దీన్ని పట్టించుకోవడంలేదు.
భోపాల్: కరోనా వైరస్ను నియంత్రించడానికి ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటిస్తే.. కొందరు అత్యుత్సాహపరులు మాత్రం దీన్ని పట్టించుకోవడంలేదు. నిబంధనలు అతిక్రమిస్తూ దర్జాగా రోడ్లపై తిరగాలని చూస్తున్నారు. మధ్యప్రదేశ్లో ఇలా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 47మందిని వారి వారి ఇళ్లలోనే బంధించారు. ఛతర్పూర్లోని కొందరు మార్చి 30 తర్వాత లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించి జిల్లా వదిలి వెళ్లి, ఆ తర్వాత మళ్లీ తిరిగొచ్చారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ తరుణంలో వీరిని మామూలుగా వదిలేయడం మంచిదికాదని భావించిన అధికారులు.. కుటుంబాలతో సహా వీరంతా ఇళ్లలోనే ఉండాలని ఆదేశించారు. ఇళ్ల నుంచి వీరెవరూ బయటకు రావద్దని తేల్చిచెప్పి గృహనిర్బంధం చేశారు.