45 రోజుల్లో 4.32లక్షల మందికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-05-08T16:03:22+05:30 IST

రాష్ట్రంలో గత ఏడాది మార్చి నుంచి ప్రారంభమైన కరోనా మొదటి దశ ఏప్రిల్‌, మే నెలల్లో తీవ్రరూపం దాల్చింది. అనంతరం ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యలతో క్రమక్రమంగా నియంత్రణలోకి వచ్చింది.

45 రోజుల్లో 4.32లక్షల మందికి కరోనా పాజిటివ్‌

- విజృంభిస్తున్న కరోనా సెకండ్‌ వేవ్‌

- 2,300 మంది మృతి


 పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో గత ఏడాది మార్చి నుంచి ప్రారంభమైన కరోనా మొదటి దశ ఏప్రిల్‌, మే నెలల్లో తీవ్రరూపం దాల్చింది. అనంతరం ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యలతో క్రమక్రమంగా నియంత్రణలోకి వచ్చింది. ఆ తర్వాత లాక్‌డౌన్‌ నిబంధనలు విడతల వారీగా తొలగిస్తూ పూర్తిగా ఎత్తివేయడంతో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది. కానీ, ఈ ఏడాది మార్చి నుంచి కరోనా రెండవ దశ వ్యాప్తి మళ్లీ ప్రారంభమైంది. మార్చి 20వ తేదీ రోజువారీ కేసులు 1,243 ఉండగా, 8 మంది మృతిచెందారు. అప్పటివరకు రాష్ట్రంలో 12,590 మంది మృతిచెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 7,291గా ఉంది. అనంతరం మెరుపు వేగంతో కరోనా వ్యాప్తిచెందింది. మార్చి 30వ తేదీకి రోజువారీ కేసులు 2,332కు పెరుగగా, మొత్తం బాధితుల సంఖ్య 8,34,904గా ఉంది. ఆ రోజున 16 మంది మృతిచెందగా, మొత్తం మృతుల సంఖ్య 12,700కు చేరుకుంది. ఏప్రిల్‌లో కరోనా వ్యాప్తి తీవ్రమై రెండు వారాల్లోనే బాధితుల సంఖ్య రెట్టింపయ్యింది. ఏప్రిల్‌ 14వ తేదీ 7,819 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా, చెన్నైలోనే 2,564 మందికి వైరస్‌ సోకింది. బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతూ ఏప్రిల్‌ నెలాఖరుకల్లా రోజుకు నమోదవుతున్న కేసుల సంఖ్య 20 వేలకు పైగా చేరుకుంది. ఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఒకేరోజు అత్యధికంగా 24 వేలకు పైగా కేసులు నమోదుకాగా, మొత్తం బాధితుల సంఖ్య 12.97 లక్షలు దాటింది. అలాగే, ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఒకేరోజు 195 మంది మృతిచెందగా, మొత్తం మృతుల సంఖ్య 14,974కు చేరింది. ఆ ప్రకారం 45 రోజుల్లో కరోనా బాధితుల సంఖ్య 4,32,700కు చేరుకోగా, 2,300 మంది మృతి చెందారు. రాబోయే రోజుల్లో కరోనా మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదముందని, ప్రజలు మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటించాలని, సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండాలని ఆరోగ్యశాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.


ప్రభుత్వాస్పత్రిలో 43 మంది మృతి

రాష్ట్రంలో చెన్నై నగరంలో మాత్రమే కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. కరోనా నియంత్రణ చర్యలను అటు ప్రభుత్వం, ఇటు కార్పొరేషన్‌ సంయుక్తంగా చేపడుతున్నాయి. నగరంలోని ప్రధాన ప్రభుత్వాస్పత్రిలోని  కరోనా ప్రత్యేక వార్డులో బుధవారం 43 మంది, గురువారం 40 అని, రెండు రోజుల్లో 83 మంది మృతిచెందారు. వార్డులో తీవ్ర లక్షణాలతో ఉన్న బాధితులకు వైద్యులు చికిత్సలు అందిస్తున్నా, పలువురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Updated Date - 2021-05-08T16:03:22+05:30 IST