కరోనా మృతులకు 4,444 దీపాలతో నివాళి
ABN , First Publish Date - 2021-06-21T12:27:36+05:30 IST
అసోంలోని దిబ్రూఘర్ జిల్లాలోని...
దిబ్రూఘర్: అసోంలోని దిబ్రూఘర్ జిల్లాలోని రెండు గ్రామాల ప్రజలు కోవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి వినూత్న రీతిలో నివాళులు అర్పించారు. మొత్తం 4,444 దీపాలు వెలిగించి, కరోనా మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. నహర్ కతియా పరిధిలోని నా-ఖోటియా సోనోవాల్, మాథవోని అనే రెండు గ్రామాలకు చెందిన ప్రజలు వారి గ్రామాల రోడ్లకు ఇరువైపులా దీపాలు వెలిగించారు. ఈ రెండు గ్రామాల్లోని 774 కుటుంబాల వారు రాత్రివేళ మొత్తం 4444 దీపాలను వెలిగించారు.
ఈ సందర్భంగా ఈ ప్రాంతానికి చెందిన గాకుల్ బోరా మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది పిల్లలు అనాథలుగా మారారు. మా గ్రామంలోనూ కరోనాతో పలువురు మృత్యువాత పడ్డారు. కరోనా కట్టడి కోసం గ్రామంలోని వారంతా కోవిడ్-19 నియమాలను పాటిస్తున్నారని తెలిపారు. కాగా అసోంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 3,571 కరోనా కేసులు నమోదయ్యాయి. 40 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,178కి చేరుకుంది. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 5,141 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,41,184 కు చేరుకుంది.