తేయాకు తోట ప్రమాదంలో మృతులు 43
ABN , First Publish Date - 2020-08-10T06:27:50+05:30 IST
కేరళలోని ఇడుక్కిజిల్లా పెట్టిముడి తేయాకు తోటల వద్ద తేయాకు కార్మికుల నివాస సముదాయంపై కొండ చరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య 43కు చేరింది...
కోచి/బెంగళూరు, ఆగస్టు 9: కేరళలోని ఇడుక్కిజిల్లా పెట్టిముడి తేయాకు తోటల వద్ద తేయాకు కార్మికుల నివాస సముదాయంపై కొండ చరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య 43కు చేరింది. శిథిలాల నుంచి ఆదివారం 17 మృతదేహాలను వెలికి తీశారు. జాతీయ విపత్తు స్పందన దళానికి చెందిన 55 మంది సహాయక చర్యలను కొనసాగిస్తోంది. కాగా, కేరళను కుండపోత వర్షాలు వదలడం లేదు. ఇడుక్కి, మలప్పురం, వాయనాడ్, కాసరగాడ్, కోజికోడ్, కన్నూర్, అళప్పుజ జిల్లాల్లో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. కొట్టాయం, అళప్పుజ జిల్లాలపై వరద ప్రభావం ఎక్కువగా ఉంది. లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి ముంపునీరు చేరుతోంది. దీంతో వందల కుటుంబాలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. అంగమలికి చెందిన జస్టిన్ అనే వ్యక్తి మనార్కాడ్ ప్రాంతంలో కారుతో సహా వరదల్లో కొట్టుకుపోయారు. కాగా, మంగళూరు ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలు యథాతథంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.