132 రోజుల తర్వాత 4.28 లక్షలకు

ABN , First Publish Date - 2020-12-03T08:25:21+05:30 IST

132 రోజుల తర్వాత 4.28 లక్షలకు

132 రోజుల తర్వాత 4.28 లక్షలకు

గణనీయంగా తగ్గిన క్రియాశీల కొవిడ్‌-19 కేసులు

మొత్తం కేసులు 94.99 లక్షలకు.. 

కొత్తగా మరో 36,604 


న్యూఢిల్లీ, డిసెంబరు 2: దేశంలో ప్రతి రెండు, మూడు వారాలకు పది లక్షల కొత్త కరోనా కేసులు నమోదవుతున్న సంక్షోభ తరుణంలో.. ఓ ఆశాజనక పరిణామం. కొవిడ్‌-19 క్రియాశీల కేసుల సంఖ్య 132 రోజుల తర్వాత మళ్లీ 4.28 లక్షలకు చేరింది. చివరగా జూలై 23న 4.26 లక్షల క్రియాశీల కేసులు ఉండగా.. తాజాగా మంగళవారం నాటికి ఆ సంఖ్య 4.28 లక్షలకు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. మూడు రోజులుగా ప్రతిరోజు ఇంచుమించు 30వేల కొత్త కేసులు నమోదవుతున్నట్లు తెలిపింది. గత 24 గంటల వ్యవధిలో దేశంలో 36,604 కొత్త ఇన్ఫెక్షన్లు నిర్ధారణ కాగా, 43,062 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారని వెల్లడించింది. గత ఐదురోజులుగా ఇదే ధోరణి కొసాగుతోందని.. నమోదయ్యే కొత్త కేసుల కంటే కోలుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోందని పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు 94.99 లక్షల మంది కరోనా బారినపడగా, 89.32 లక్షల మంది కోలుకున్నారు. దీంతో కొవిడ్‌ రికవరీ రేటు 94.03 శాతానికి పెరిగింది.


కరోనా నుంచి కోలుకున్న వారిలో 78.35 శాతం మంది 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వారే కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా కరోనాతో గత 24 గంటల్లో 501 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1.38 లక్షలు దాటింది. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో జరుగుతున్న భారత్‌ బయోటెక్‌ ‘కోవ్యాక్సిన్‌’ ప్రయోగ పరీక్షల్లో ఆ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫిర్హాద్‌ హాకిం తొలి వలంటీర్‌గా మారారు. బుధవారం ఆయన వ్యాక్సిన్‌ తొలి డోసును వేయించుకున్నారు. 

Updated Date - 2020-12-03T08:25:21+05:30 IST