విధ్వంసం

ABN , First Publish Date - 2022-05-23T06:42:08+05:30 IST

కోనసీమ జిల్లా కోసం తన అభిప్రాయాన్ని వాట్సాప్‌ స్టేటస్‌లోపెట్టాడని మండలంలోని ఖండ్రిగ బీసీ పేటలో ఒక యువకుడి ఇంటిపై ఒక సామాజికవర్గానికి చెందిన సుమారు 40 మంది యువకులు దాడి చేసిన ఘటన తీవ్ర సంచలనం కలిగించింది.

విధ్వంసం
ధ్వంసమైన ఇంటి పరిసరాలను పరిశీలిస్తున్న సీఐ, ఎస్‌ఐ

  • కోనసీమ జిల్లా కోసం వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టాడని యువకుడి ఇల్లు ముట్టడి 
  • అతడు లేకపోవడంతో తల్లి, పెద్దమ్మలపై దాడి
  • కొత్తపేట మండలం ఖండ్రిగ బీసీ పేటలో ఘటన

కొత్తపేట, మే 22: కోనసీమ జిల్లా కోసం తన అభిప్రాయాన్ని వాట్సాప్‌ స్టేటస్‌లోపెట్టాడని మండలంలోని ఖండ్రిగ బీసీ పేటలో ఒక యువకుడి ఇంటిపై ఒక సామాజికవర్గానికి చెందిన సుమారు 40 మంది యువకులు దాడి చేసిన ఘటన తీవ్ర సంచలనం కలిగించింది. వాట్సాప్‌ మెసేజ్‌ పెట్టిన యువకుడు ఇంటి వద్ద లేకపోవడంతో అతడితల్లి, పెద్దమ్మలపై దాడి చేసి ఇంట్లో వస్తువులతో పాటు వాహనాలను సైతం ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న రావులపాలెం సీఐ ఎం.వెంకటనారాయణ, ఎస్‌ఐ వి.మణికుమార్‌ సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. గాయపడ్డ మహిళలను కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ఖండ్రిగ గ్రామానికి చెందిన బొక్కా రాజేష్‌ తన వాట్సాప్‌ స్టేటస్‌లో కోనసీమ జిల్లాగానే  పేరు ఉంచాలంటూ మెసేజ్‌ పెట్టడంతో ఆగ్రహానికి లోనైన ఓవర్గం యువకులు ఆదివారం అతడి ఇంటిని చుట్టుముట్టారు. మీ అబ్బాయి ఎక్కడం టూ తల్లి పద్మను అడగ్గా... తన కుమారుడు ఇంటివద్ద లేడని చెప్పిన ఆమెను, అడ్డు వచ్చిన తోటికోడలైన లక్ష్మిలను గాయపరిచారు. దీంతో వారిని కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి  తరలించారు. పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ మణికుమార్‌ తెలిపారు.  

Updated Date - 2022-05-23T06:42:08+05:30 IST