బాబా ముసుగులో మరో కీచకుడు.. నలుగురు మహిళలపై అత్యాచారం..

ABN , First Publish Date - 2021-05-07T01:19:51+05:30 IST

రాజస్థాన్‌లోని జైపూర్‌లో స్వయం ప్రకటిత బాబా ఒకరు తన ఆశ్రమంలో నలుగురు మహిళలపై అత్యాచారానికి ఒడిగట్టిన వైనం...

బాబా ముసుగులో మరో కీచకుడు.. నలుగురు మహిళలపై అత్యాచారం..

జైపూర్: రాజస్థాన్‌లోని జైపూర్‌లో స్వయం ప్రకటిత బాబా ఒకరు తన ఆశ్రమంలో నలుగురు మహిళలపై అత్యాచారానికి ఒడిగట్టిన వైనం వెలుగులోకి వచ్చింది. ఇందులో ముగ్గురు మహిళలు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం మరింత కలకలం రేపింది. తపస్వి ఆశ్రమంలో సత్సంగంలో పాల్గొనేందుకు వెళ్లిన తమపై బాబా శైలేంద్ర మెహతా అత్యాచారానికి పాల్పడినట్టు బాధితులు ఫిర్యాదుచేశారని భంక్రోటా స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముకేశ్ చౌదరి పేర్కొన్నారు. ‘‘చాలా ఏళ్లుగా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆ ఆశ్రమానికి వెళ్తున్నట్టు బాధితులు వెల్లడించారు. సేవల పేరుతో ఆ మహిళలు రెండు రోజుల పాటు ఆశ్రమంలోనే ఉండేవారు. అదే సమయంలో నిందితుడు వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు...’’ అని ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు మంగళవారం ఫిర్యాదు చేయగా... మరో బాధితురాలు బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఆయన తెలిపారు.


బాధితుల్లో ఒకరు తన కుమార్తెను ఆశ్రమానికి తీసుకెళ్లొద్దంటూ తన భర్తకు అడ్డుపడడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ‘‘ఆమె తనకు జరిగిన దారుణాన్ని చెప్పడంతో... అదే కుటుంబానికి చెందిన మరో ఇద్దరు మహిళలు కూడా ధైర్యం చేసి నిందితుడి దురాగతాన్ని బయటపెట్టారు. దీంతో ఆ కుటుంబం మొత్తం నిందితుడిపై కేసుపెట్టేందుకు ముందుకొచ్చింది...’’ అని ఎస్‌హెచ్‌వో వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోందనీ... ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-05-07T01:19:51+05:30 IST