-
-
Home » Andhra Pradesh » 4 Missing Girls Address Found in Pune-MRGS-AndhraPradesh
-
పుణెలో విద్యార్థినుల ఆచూకీ లభ్యం.. Chandragiri నుంచి ఎలా వెళ్లారు.. అసలేం జరిగింది..!?
ABN , First Publish Date - 2022-05-13T12:07:21+05:30 IST
పుణెలో విద్యార్థినుల ఆచూకీ లభ్యం.. Chandragiri నుంచి ఎలా వెళ్లారు.. అసలేం జరిగింది..!?
చిత్తూరు జిల్లా/చంద్రగిరి : చంద్రగిరి మండలంలోని తొండవాడ సమీపంలో కంచికామకోటి పీఠం నిర్వహిస్తున్న సంప్రదాయ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో అదృశ్యమైన నలుగురు విద్యార్థినుల ఆచూకీ లభ్యమైంది. వీరిని పుణె నుంచి చంద్రగిరికి స్థానిక పోలీసులు తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో ఉంటూ డిగ్రీ చదువుతున్న విశాఖపట్నం (Vizag) జిల్లా సింహాచలం బంగారమ్మవీధికి చెందిన కామేశ్వరరావు కుమార్తె రవివిద్యలక్ష్మి వర్షిణి(18), కడప జిల్లా రాజుపాలెంకు చెందిన బెల్లల శ్యామ్కుమార్ కుమార్తె ప్రణతి(18), విజయవాడలోని విద్యాధరపురం, కామకోటినగర్కు చెందిన జయంతి అనంత్ కుమార్తె స్రవంతి(18), విజయనగరం సిటీలోని గంగాధరశర్మ కుమార్తె అక్కిని శ్రీవల్లి(19)లు ఆదివారం రాత్రి ప్రహరీ దూకి పరారయ్యారని పోలీసులకు పాఠశాల ఇన్చార్జ్ లక్ష్మి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తిరుపతి వెస్ట్ డీఎస్పీ నరసప్ప ఆధ్వర్యంలో పోలీసులు నాలుగు బృందాలు విడిపోయి సెల్ఫోన్ (Cell Phone) ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు.. సంప్రదాయ పాఠశాలలో (School) ఏడో తరగతి నుంచి డిగ్రీ వరకు సుమారు 350 విద్యార్థినులున్నారు. వీరంతా తమ తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులతో 15 రోజులకు ఓసారి మాత్రమే మాట్లాడానికి వీలుగా పాఠశాల యాజమాన్యమే 15 సెల్ఫోన్లు ఏర్పాటు చేసింది. పరారైన నలుగురు విద్యార్థినులు (Girl Students) ఈ సెల్ఫోన్లలో ఒకదాన్ని అపహరించి.. తమ గదిలో పెట్టుకున్నారు. ఈ విషయం యాజమాన్యానికి తెలియడంతో గత శుక్రవారం విద్యార్థినులను మందలించారు. అలాగే శనివారం వీరికి డిగ్రీ పరీక్షల హాల్ టికెట్లను ఇవ్వలేదు. మీ తల్లిదండ్రులు వస్తే.. సెల్ఫోన్ అపహరణ విషయం చెప్పాక హాల్ టికెట్లు (Hall Tickets) ఇస్తామనడంతో విద్యార్థినులు భయపడ్డారు.
ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో పాఠశాల నుంచి పరారై.. రేణిగుంటకు వచ్చారు. అక్కడినుంచి కొల్హాపూర్కు వెళ్లే రైలెక్కేశారు. కొల్హాపూర్లో ఒకరోజు ఉండాక పుణెకు వెళ్లినట్లు సమాచారం. వీరిని గురువారం పుణెలోని ఆర్మీ ఉద్యోగి శ్రీనివాసన్ గుర్తించి.. డీఎస్పీకి సమాచారం ఇచ్చారు. దాంతో చంద్రగిరి సీఐ శ్రీనివాస్, కానిస్టేబుళ్లు గిరిధర్రెడ్డి, సుబ్రహ్మణ్యం, గాయత్రిలు వెంటనే వెళ్లి విద్యార్థినులను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రానికి వీరు చంద్రగిరికి చేరుకోనున్నట్లు సమాచారం.