జడ్పీలో 385 మంది బదిలీ

ABN , First Publish Date - 2022-07-01T06:04:07+05:30 IST

జడ్పీ బదిలీల్లో అధికారులు సిఫార్సులకు పెద్ద పీట వేశారు. అయిన వారికి అగ్రతాంబూలం వేశారు. జడ్పీ పరిధిలో 385 మంది ఉద్యోగులను బదిలీ చేశారు

జడ్పీలో 385 మంది బదిలీ
రాత్రి 7.54 గంటలకు ఉత్తర్వులు తీసుకుంటున్న ఉద్యోగులు

 నిబంధనలు తుంగలో తొక్కిన అధికారులు

అనంతపురం విద్య, జూన్‌ 30: జడ్పీ బదిలీల్లో అధికారులు సిఫార్సులకు పెద్ద పీట వేశారు. అయిన వారికి అగ్రతాంబూలం వేశారు. జడ్పీ పరిధిలో 385 మంది ఉద్యోగులను బదిలీ చేశారు. ఈ మేరకు గురువారం ఉద్యోగులకు బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్లు 26 మంది, సీనియర్‌ అసిస్టెంట్లు 50 మంది, జూనియర్‌ అసిస్టెంట్లు  134 మంది, టైపిస్టులు 27 మంది, రికార్డు అసిస్టెంట్లు 74 మంది, ల్యాబ్‌  అసిస్టెంట్లు 19 మంది, ఆపీస్‌ సబార్డినేట్స్‌ 54 మంది, ఒక డ్రైవర్‌ను బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి జడ్పీ ప్రాంగణం కిటకిటలాడింది. మహిళా ఉద్యోగులు, ఆశావహులు ఉదయమే ఆఫీ్‌సకు చేరుకుని సాయంత్రం వరకూ పడిగాపులు కాశారు. అయితే సాయంత్రం తర్వాత బదిలీ ఆర్డర్‌లు అందజేశారు. 

ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం

బదిలీల్లో భారీగా సిఫార్సు లేఖలు చక్కర్లు కొట్టాయి. ఆఖరి రోజు సైతం సిఫార్సు అసా్త్రలు పనిచేశాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల లేఖలకు అధికారులు తలొగ్గి... ఇష్టారాజ్యంగా బదిలీలు చేశారన్న విమర్శలూ వచ్చాయి. కొందరు రికార్డు అసిస్టెంట్లు 5 ఏళ్లు పూర్తిచేసుకున్న వారు  మరో చోటకు వెళ్లేందుకు 3 ఆప్షన్లు ఇస్తే......ఆప్షన్లు లేవు.. ఏం లేవు...మీ స్థానాల్లో మీరే ఉండాలంటూ...హూంకరించినట్లు సమాచారం. తమకు అవసరమైన స్థానాలకు అధికారాలు బేరాలు ఆడినట్లు విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా కొందరు సంఘాల నాయకులను సైతం కొందరిని సుదూర ప్రాంతాలకు, కొందరిని దగ్గరల్లోనే ఉంచుకునేందుకు భారీగా చక్రం తిప్పారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2022-07-01T06:04:07+05:30 IST