ఒమన్ నుంచి అదనంగా 34 రిపాట్రియేషన్ విమానాలు
ABN , First Publish Date - 2020-07-12T19:08:56+05:30 IST
కరోనా కల్లోలం కారణంగా విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో భారత ప్రవాసులు వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన విషయం విదితమే.
మస్కట్: కరోనా కల్లోలం కారణంగా విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో భారత ప్రవాసులు వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన విషయం విదితమే. ఇలా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం 'వందే భారత్ మిషన్' ద్వారా స్వదేశానికి తరలిస్తోంది. ఇప్పటికే మూడు విడతలు పూర్తి చేసుకున్న ఈ మిషన్లో ఇప్పుడు నాలుగో దశ కొనసాగుతోంది. దీనిలో భాగంగా గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న ఎన్నారైలను భారత్కు తరలించేందుకే కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇక 'వందే భారత్ మిషన్'లో ప్రధాన భాగమైన ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిరిండియా తాజాగా ఒమన్ నుంచి అదనంగా 34 రిపాట్రియేషన్ విమానాలు నడపనున్నట్లు ప్రకటించింది.
కాగా, గల్ఫ్ దేశాల నుంచి భారతీయులను తరలించేందుకు 200కు పైగా ఫ్లైట్స్ను ఉపయోగిస్తున్నారు. "గల్ఫ్ దేశాల నుండి భారత పౌరులను తిరిగి తీసుకురావడానికి విమానాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాల కోసం మీ టిక్కెట్లను బుకింగ్ కార్యాలయాలలో బుక్ చేసుకోండి" అని ఎయిరిండియా ప్రకటించింది. ఇక ఒమన్ కాకుండా యూఏఈలోని నగరాలకు 145 విమానాలు (దుబాయ్, షార్జాలకు చెరో 54, అబుదాబికి 37) ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బహ్రెయిన్కు ఏడు, సౌదీ అరేబియాలో మూడు నగరాల(దమ్మామ్, జెడ్డా, రియాద్)కు 50 విమానాలు ఏర్పాటు చేసినట్లు ఎయిరిండియా పేర్కొంది.