338కి చేరిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-06-04T10:40:15+05:30 IST

కరోనా విజృంభణ ఆగడం లేదు. జిల్లాలో మరో 11 కరోనా కేసులు నమోదయ్యాయి.

338కి చేరిన కరోనా కేసులు

 తాజాగా 11 పాజిటివ్‌లు


తిరుపతి, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి):కరోనా విజృంభణ ఆగడం లేదు. జిల్లాలో మరో  11 కరోనా కేసులు నమోదయ్యాయి.మంగళవారం సాయంత్రం వరకూ రికార్డుస్థాయిలో 41 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. వాటిలో శ్రీకాళహస్తి మండలంలో 16 కేసులుండగా సాయంత్రం తర్వాత శ్రీకాళహస్తి పట్టణం జయరామరావు వీధికి చెందిన ఓ మహిళ (35)కు వైరస్‌ సోకినట్టు గుర్తించారు. ఆమె తమిళనాడులోని తిరువళ్లూరు నుంచి వచ్చినట్టు తెలిసింది. ఇక బుధవారం రేణిగుంట మండలంలో 3, నాగలాపురం, చిత్తూరుల్లో రెండేసి, తిరుపతి, బంగారుపాళ్యం, పుంగనూరుల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి.


రేణిగుంట కేసుల విషయానికొస్తే కరకంబాడి తారకరామనగర్‌కు చెందిన 38 ఏళ్ళ మహిళకు, 38 ఏళ్ళ పురుషుడికి, 60 ఏళ్ళ వృద్ధురాలికి వైరస్‌ సోకింది. తారకరామనగర్‌లో ఇదివరకే ఓ యువకుడికి వైరస్‌ సోకడంతో అతడి ప్రైమరీ కాంటాక్టులుగా వున్న ఈ ముగ్గురికీ కూడా వైరస్‌ సంక్రమించింది. చిత్తూరులో చెన్నమగుడిపల్లెకు చెందిన 50 ఏళ్ళ వ్యక్తికి, మంగసముద్రానికి చెందిన 47 ఏళ్ళ వ్యక్తికి వైరస్‌ సోకింది. తొలి వ్యక్తి వైరస్‌ సోకిన మరొకరికి ప్రైమరీ కాంటాక్టుగా వున్నందున కరోనా బారిన పడగా రెండవ వ్యక్తి తమిళనాడులోని తిరుత్తణి నుంచీ వచ్చినట్టు గుర్తించారు. నాగలాపురంలో 37 ఏళ్ళ వ్యక్తికి, ఐదేళ్ళ చిన్నారికి వైరస్‌ సోకగా వారిద్దరూ కూడా కరోనా రోగుల ప్రైమరీ కాంటాక్టులుగా వున్నారు. పుంగనూరు పట్టణం గాంధీనగర్‌కు చెందిన 65 ఏళ్ళ వృద్ధుడికి సోకింది. ఇతడు కూడా కోవిడ్‌ బారిన పడిన ఓ మహిళకు సెకండరీ కాంటాక్టుగా వున్నారు.


బంగారుపాళ్యం మండలం జంబుగానిపల్లెకు చెందిన 32 ఏళ్ళ మహిళ సైతం ఓ కోవిడ్‌ రోగికి సెకండరీ కాంటాక్టుగా వుండి వైరస్‌ బారినపడ్డారు. తిరుపతి రైల్వే కాలనీకి చెందిన 47 ఏళ్ళ వ్యక్తికి కరోనా లక్షణాలు అగుపించగా అతనే స్వచ్ఛందంగా ఆస్పత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకోగా కరోనా అని తేలింది. బాధితుడికి రైల్వే కాలనీలోనూ, బైరాగిపట్టెడలోనూ ఇళ్ళుండడంతో రెండు ప్రాంతాలనూ అధికారులు రెడ్‌జోన్లుగా ప్రకటించారు. ఈ కేసుతో తిరుపతి నగరంలో కేసుల సంఖ్య 20కి చేరుకోగా జిల్లాలో మొత్తం కేసులు 338కి పెరిగాయి.

Updated Date - 2020-06-04T10:40:15+05:30 IST