ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. గాజాలో 33 మంది మృతి

ABN , First Publish Date - 2021-05-17T02:02:38+05:30 IST

ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య ఘర్షణ రోజురోజుకు మరింత ముదురుతోంది. ఇజ్రాయెల్ దాడులతో గాజా చిగురుటాకులా వణుకుతోంది.

ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. గాజాలో 33 మంది మృతి

గాజా: ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య ఘర్షణ రోజురోజుకు మరింత ముదురుతోంది. ఇజ్రాయెల్ దాడులతో గాజా చిగురుటాకులా వణుకుతోంది. ఇజ్రాయెల్ దళాలు, పాలస్తీనా మిలిటెంట్ల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలో ప్రజలు పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. నేడు వరుసగా ఏడో రోజు ఇరు వర్గాల మధ్య పరస్పరం దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ దళాలు గాజా సిటీపై జరిపిన వైమానిక దాడిలో 33 మంది పాలస్తీనియన్లు మరణించారు. 


ఇజ్రాయెల్ దళాలు నిన్న గాజాలో అల్ జజీరా సహా పలు అంతర్జాతీయ మీడియా సంస్థలున్న 12 అంతస్తుల భవాన్ని నేలమట్టం చేశాయి. గాజాలో నేలమట్టమైన నాలుగో అతి పెద్ద భవనం ఇది. 2014 తర్వాత ఇక్కడ ఈ స్థాయిలో ఘర్షణలు జరగడం ఇదే తొలిసారి. గాజాలో ఇప్పటి వరకు 139 మంది చనిపోయారు. వీరిలో 39 మంది చిన్నారులు కాగా, 22 మంది మహిళలు. 950 మంది గాయపడ్డారు. 2014లో జరిగిన ఘర్షణలో 70 మంది ఇజ్రాయిలీలు, 2100 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 


ఈ వారం మొదట్లో  పాలస్తీనా రాకెట్ దాడిలో మరణించిన కేరళ మహిళ  అంత్యక్రియలు నేడు కీరితోడులోని నిత్య సహాయ మాత చర్చిలో ముగిశాయి. అంతకుముందు ఆమె ఇంట్లో ప్రార్థనలు నిర్వహించారు. మరోవైపు, పారిస్‌లో పాలస్తీనియన్లకు మద్దతుగా ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిపై టియర్ గ్యాస్, వాటర్ కేనన్లను ప్రయోగించి చెదరగొట్టారు.

Updated Date - 2021-05-17T02:02:38+05:30 IST