Saudi Arabia: హై-స్పీడ్ రైళ్లు నడపనున్న 31 మంది సౌదీ మహిళలు
ABN , First Publish Date - 2022-08-07T16:35:09+05:30 IST
సౌదీ అరేబియా సర్కార్ గతకొంతకాలంగా మహిళలను అన్ని రంగాలలో భాగస్వాములను చేస్తున్న విషయం తెలిసిందే.
రియాద్: సౌదీ అరేబియా సర్కార్ గతకొంతకాలంగా మహిళలను అన్ని రంగాలలో భాగస్వాములను చేస్తున్న విషయం తెలిసిందే. మహిళా సాధికారత-సామాజిక భద్రత అనే ఆలోచనతో ముందుకు వెళ్తున్న సౌదీ అరేబియా ప్రభుత్వం ఇటీవల వారి విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. హై-స్పీడ్ రైళ్లు నడిపేందుకు వారికి అవకాశం ఇచ్చింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా 31 మంది మహిళలను శిక్షణ కోసం ఎంపిక చేసింది. మొదట ఈ ట్రైనింగ్ ప్రొగ్రామ్ కోసం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు సుమారు 28వేల మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 145 మంది పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. అనంతరం ఈ 145 మంది నుంచి కేవలం 31 మంది మాత్రమే ఫస్ట్ స్టేజ్ ట్రైనింగ్కు వెళ్లారు. తాజాగా వీరికి మొదటి దశ శిక్షణ పూర్తి అయింది. త్వరలోనే వీరు రెండో దశ శిక్షణకు వెళ్లనున్నారు. 5నెలలు ఉండే ఈ శిక్షణలో ట్రైనీలు ప్రొఫెషనల్ డ్రైవర్ల సమక్షంలో ప్రాక్టికల్ శిక్షణను పూర్తి చేయనున్నారు. తుది దశ శిక్షణను పూర్తి చేసుకుని ఎంపికైన మహిళలు మక్కా, మదీనా నగరాల మధ్య ఒక ఏడాది తర్వాత బుల్లెట్ ట్రైన్స్ను నడుపుతారని సంబంధిత అధికారులు తెలిపారు. ఇక గడిచి ఐదేళ్లలో అనేక రంగాల్లో మహిళల భాగస్వామ్యం 33శాతానికి పెరిగిందన్నారు.