ఎకరాకు 30 వేల నష్టపరిహారమివ్వాలి
ABN , First Publish Date - 2020-10-24T08:38:26+05:30 IST
ఎకరాకు 30 వేల నష్టపరిహారమివ్వాలి
వరద బాధితులంద రికీ సాయం అందాలి: ఆర్.కృష్ణయ్య
జీహెచ్ఎంసీఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్కు డిమాండ్
దిల్సుఖ్నగర్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలతో వరదలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం చైతన్యపురిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్, మెదక్ తదితర ఉమ్మడి జిల్లాల్లో సుమారు 30 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందన్నారు. నగరంలోని వరద బాధితుల్లో కేవలం గ్రౌండ్ఫ్లోర్లో ఉంటోన్న వారికే నష్ట పరిహారం ఇస్తున్నారని చెప్పారు.
మొదటి అంతస్తులో ఉన్న వారి వాహనాలు, ఇతరతర పరికరాలు చాలా వరకు వరదనీటికి పాడైనందున వారికి కూడా నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. స్థానిక టీఆర్ఎస్ నేతలు సూచించిన గ్రూపులు, వ్యక్తులకు మాత్రమే నష్ట పరిహారం ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. హైదరాబాద్లో ఇళ్లు లేని వరద బాధితులందరికి తక్షణమే డబుల్బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.