HYD Traffic : రాయితీ ముగిసినా చలానాలు చెల్లించలే.. 30 శాతం పెండింగ్..
ABN , First Publish Date - 2022-04-30T11:52:17+05:30 IST
రాయితీ ముగిసినా చలానాలు చెల్లించలే.. 30 శాతం పెండింగ్..
- వారిపై కేసులు.. చట్టపరమైన చర్యలు : రంగనాథ్
హైదరాబాద్ సిటీ : వాహనాల పెండింగ్ చలానాల చెల్లింపునకు ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు ముగిసినా మరో 30శాతం మంది చలానాలు పెండింగ్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నెలన్నరపాటు సాగిన ప్రత్యేక రాయితీ ద్వారా 3 కోట్లకు పైగా చలానాలు క్లియర్ అయ్యాయి. 65 శాతం కార్ల యజమానులు, 70శాతానికి పైగా ద్విచక్ర వాహనదారులు పెండింగ్ చలానాలు చెల్లించారు. రూ.1700 కోట్ల పెండింగ్ చలానాల్లో రూ. 1004 కోట్లు (రాయితీ తర్వాత రూ. 303 కోట్లు) వసూలయ్యాయి.
కఠిన చర్యలు
ప్రభుత్వ రాయితీ ముగిసిన తర్వాత కూడా ఇంకా 30శాతం మంది వాహనదారులు చలానాలు చెల్లించకుండానే రోడ్లపై తిరుగుతున్నారు. ఈ వాహనాలపై దృష్టి సారించాం. ఆయా వాహనాలను గుర్తించి చలానాలు (రాయితీ లేకుండానే) క్లియర్ చేస్తాం. అంతేకాకుండా వాహనదారులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. - రంగనాథ్, ట్రాఫిక్ జాయింట్ సీపీ