సహజ కాన్పు చేస్తే 3 వేలు!
ABN , First Publish Date - 2022-08-06T08:48:29+05:30 IST
సహజ ప్రసవాలు చేసే వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రకటించారు.
- ప్రభుత్వ వైద్య సిబ్బందికి నగదు ప్రోత్సాహకం
- శానిటేషన్ సిబ్బందికి వేతనాలను పెంచాం
- రోగులను డబ్బులు అడిగితే ఇంటికే..
- సూపరింటెండెంట్లకే అధికారాలు: మంత్రి హరీశ్
హైదరాబాద్/సిటీ/చార్మినార్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): సహజ ప్రసవాలు చేసే వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రకటించారు. సాధారణ కాన్పులు చేసే సిబ్బందికి రూ.3 వేలు ఇస్తామన్నారు. శుక్రవారమిక్కడి పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో నిర్వహించిన తల్లి పాల వారోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. సాధారణ ప్రసవంలో పాల్గొనే వైద్యులు, నర్సులు, ఆశాలు, ఏఎన్ఎంలకు ఈ ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు. సాధారణ కాన్పులపై అవగాహన పెంచుకోవాలన్నారు. గర్భిణికి సిజేరియన్ చేయాలా? వద్దా? అనేది వైద్యులు నిర్ణయిస్తారని.. కొందరు మాత్రం ముహూర్తం చూసుకొని ఆపరేషన్లు చేయించుకుంటున్నారని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో సహజ ప్రసవాల కోసం రూ.లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరతారన్నారు. ఇక్కడేమో రూ.లక్షలు ఖర్చుపెట్టి కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి సిజేరియన్లు చేయించుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ రాక ముందు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 శాతం ప్రసవాలు జరిగితే ఇప్పుడు 61 శాతానికి పెరిగాయన్నారు. తెలంగాణలో 55 శాతం సాధారణ ప్రసవాలేనని తెలిపారు.
ఒక్కో పడకకు శానిటేషన్ ఖర్చును రూ.5000 నుంచి 7500కు పెంచినట్లు చెప్పారు. మన దేశంలో కేవలం 36 శాతం మాత్రమే మొదటి గంటలో తల్లి పాలు ఇస్తున్నారని, 64 శాతం మంది శిశువులు తల్లిపాలకు దూరమవుతున్నారని వివరించారు. మొదటి గంటలో తల్లిపాలు ఇవ్వడం వల్ల శిశు మరణాల రేటు 22 శాతం తగ్గించవచ్చునని సర్వేలు చెబుతున్నాయని మంత్రి తెలిపారు. శానిటేషన్ సిబ్బందికి వేతనాలు పెంచామని, ఈఎ్సఐ, పీఎఫ్ సదుపాయం ఉంటుందని హరీశ్ చెప్పారు. సిబ్బందిపై ఏవైనా ఆరోపణలు వస్తే కఠిన చర్యలు తీసుకునే అధికారం సూపరింటెండెంట్లకు ఇస్తున్నామన్నారు. రోగులను సిబ్బంది డబ్బులు అడిగినట్లు తెలిస్తే ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. అవసరమైన స్కానింగ్లను ఆస్పత్రిలోనే చేయాలని, అందుకు తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నవజాత శిశువులకు అవసరమైన చికిత్స, మందులు అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. గాంధీ ఆస్పత్రిలో 250 పడకలతో మాతా శిశు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రోత్సాహకంపై ఉత్తర్వులు జారీ
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సహజ ప్రసవాలు చేసిన వైద్య సిబ్బందికి రూ.3 వేలు ఇవ్వనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గైనకాలజిస్టు, మెడికల్ ఆఫీసర్లకు రూ.1000; స్టాఫ్నర్స్, మిడ్వైఫ్, ఏఎన్ఎంకు రూ.1000; ఆయా, శానిటేషన్ వర్కర్లకు రూ.500 ఇస్తారు. ఇక క్షేత్రస్థాయి వైద్య సిబ్బందికి రూ.500 ఇవ్వనున్నట్లు జీవోలో పేర్కొన్నారు. అందులో సబ్సెంటర్లలోని ఏఎన్ఎంకు రూ.250, ఆశాకు రూ.250 చొప్పున ఇస్తారు. కాగా 2022-23 ఆర్థిక సంవత్సరం వరకే ఈ ప్రోత్సాహకం అమల్లో ఉంటుందని తెలిపారు.