సర్పంచ్‌ను హత్య చేసిన ఉగ్రవాదులు హతం

ABN , First Publish Date - 2022-03-16T21:21:37+05:30 IST

జమ్మూ-కశ్మీరులోని ఖన్మోహ్ సర్పంచ్‌ను హత్య చేసిన

సర్పంచ్‌ను హత్య చేసిన ఉగ్రవాదులు హతం

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరులోని ఖన్మోహ్ సర్పంచ్‌ను హత్య చేసిన ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు కశ్మీరు ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. శ్రీనగర్ జిల్లా శివారు ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరు మరణించినట్లు చెప్పారు. వీరు లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవారని తెలిపారు. 


నౌగాం ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తొయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు మరణించినట్లు తెలిపారు. ఖన్మోహ్ సర్పంచ్ సమీర్ భట్ హత్యతో వీరికి సంబంధం ఉందని చెప్పారు. నౌగాం ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిర్దిష్ట సమాచారం అందడంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, సోదాలు నిర్వహించామని చెప్పారు. ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ జరిగిందని తెలిపారు. 


పుల్వామా జిల్లాలోని అవంతిపొర, చార్సూ ప్రాంతంలో మంగళవారం ఓ లష్కరే తొయిబా ఉగ్రవాదిని మట్టుబెట్టారు. ఈ ఏడాదిలో జరిగిన 22వ ఎన్‌కౌంటర్ ఇది. మొత్తం మీద ఇప్పటి వరకు 39 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. 


Updated Date - 2022-03-16T21:21:37+05:30 IST