చేపల వేటకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి

ABN , First Publish Date - 2021-05-15T09:28:31+05:30 IST

సరదాగా చేపల వేటకు వెళ్లిన ముగ్గురు యువకులు ఊహించని విధంగా మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా చినగంజాం మండలం రాజుబంగారుపాలెం సమీపంలోని ..

చేపల వేటకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి

చినగంజాం, మే 14: సరదాగా చేపల వేటకు వెళ్లిన ముగ్గురు యువకులు ఊహించని విధంగా మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా చినగంజాం మండలం రాజుబంగారుపాలెం సమీపంలోని రొంపేరు కాలువలో శుక్రవారం చోటుచేసుకుంది. కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని మూలగానివారిపాలెంకు చెందిన మూలగాని గోపిరెడ్డి తన ముగ్గురు స్నేహితులైన రాజుబంగారుపాలెం పంచాయతీ పరిధిలోని కుక్కలవారిపాలెంకి చెందిన కొనసం దుర్గారెడ్డి(27), కొత్తపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని రైల్వేస్టేషన్‌ సెంటర్‌కు చెందిన కోకి కాశీరెడ్డి(24), వేటపాలెం మండలం కొత్తరెడ్డిపాలెంకి చెందిన నంగు రమణారెడ్డి(23)లతో కలిసి రొంపేరులో చేపల వేటకు వెళ్లారు. 


తమకు తెలిసిన మత్స్యకార స్నేహితుని వద్ద కండెల వల తీసుకుని వెళ్లారు. రమణారెడ్డి వల తీసుకుని కాలువలోకి దిగాడు. అయితే పెద్ద గుంత ఉండటంతో ప్రమాదవశాత్తు బురదలో మునిగిపోతూ కేకలు వేశాడు. రమణారెడ్డిని రక్షించేందుకు దుర్గారెడ్డి వెళ్లాడు. దుర్గారెడ్డి కూడా కూరుకుపోతుండటంతో, ఇద్దరిని కాపాడేందుకు కాశీరెడ్డి దూకాడు. ప్రమాదవశాత్తు ముగ్గురు గుంతలోనే పడి మృతి చెందారు. గోపిరెడ్డి కాలువ ఒడ్డునే ఉండిపోయాడు. ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్‌ఐ అంకమ్మరావు ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక మత్స్యకారులను, ఈతగాళ్ళను పిలిపించి మృతదేహాలను బయటకు తీయించారు.

Updated Date - 2021-05-15T09:28:31+05:30 IST