ముంబైలో విడాకులకు ట్రాఫిక్ జామ్‌లే కారణం: అమృతా ఫడ్నవీస్

ABN , First Publish Date - 2022-02-06T02:25:23+05:30 IST

బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు

ముంబైలో విడాకులకు ట్రాఫిక్ జామ్‌లే కారణం: అమృతా ఫడ్నవీస్

ముంబై: బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబైలో మూడు శాతం విడాకులకు ట్రాఫిక్ జామ్‌లే కారణమని ఆరోపించారు. ఓ సామాన్య వ్యక్తి కోణంలో తానీ వ్యాఖ్యలు చేస్తున్నట్టు చెప్పారు.


నగరంలో గుంతలు, ట్రాఫిక్ జామ్‌లను తాను ప్రతి రోజూ చూస్తున్నానని అన్నారు. ముంబైలో విడాకులు తీసుకుంటున్న వారిలో మూడు శాతం మంది వీటి కారణంగానే విడిపోతున్నారని, ఈ విషయం మీకు తెలుసా? అని ప్రశ్నించారు. ట్రాఫిక్ జామ్స్ కారణంగా ప్రజలు తమ కుటుంబ సభ్యులకు సమయాన్ని కేటాయించలేకపోతున్నారని అమృత ఆవేదన వ్యక్తం చేశారు. 


అమృత వ్యాఖ్యలపై ముంబై మేయర్ కిషోరి పడ్నేకర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బీజేపీతో సంబంధం ఉన్న వ్యక్తులే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని, ఇలాంటివి విని ప్రజలు విసిగిపోయారని అన్నారు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా అమృత ‘విడాకుల’ వ్యాఖ్యలపై స్పందించారు. ట్రాఫిక్ కారణంగా 3 శాతం మంది ముంబై వాసులు విడాకులు తీసుకుంటున్నారని చెప్పిన మహిళకు బెస్ట్ ‘లాజిక్ అవార్డు’ అవార్డు ఇవ్వాలని అమృత పేరు ప్రస్తావించకుండా ఎద్దేవా చేశారు.  


దీనికి ప్రతిగా అమృత ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ఓ సర్వేలో వెల్లడైన విషయాలనే తాను చెప్పానని పేర్కొన్నారు. భారీ ట్రాఫిక్ జామ్‌ల కారణంగా ముంబై వాసులు శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ఆ సర్వే పేర్కొందని గుర్తు చేశారు. ట్రాఫిక్ జామ్‌ల కారణంగా ఉద్యోగి ఉత్పాదకత తగ్గిపోయి విడాకులు పెరుగుతున్నాయని అమృత చెప్పుకొచ్చారు. 

Updated Date - 2022-02-06T02:25:23+05:30 IST