బ్యాంకులో రూ.3కోట్లు గోల్మాల్
ABN , First Publish Date - 2021-04-21T06:25:38+05:30 IST
స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒంగోలు ప్రకాశం భవన్ బ్రాంచ్లో రూ.3కోట్ల వరకూ గోల్మాల్ అయినట్లు అఽధికారులు గుర్తించారు.
నకిలీ పత్రాలు, తప్పుడు చిరునామాలు
మొత్తం 13మంది లబ్ధిదారుల పాత్ర
ఎస్బీఐ అంతర్గత ఆడిట్లో బహిర్గతం
కేసు నమోదు చేసిన పోలీసులు
ఒంగోలు(క్రైం), ఏప్రిల్ 20: స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒంగోలు ప్రకాశం భవన్ బ్రాంచ్లో రూ.3కోట్ల వరకూ గోల్మాల్ అయినట్లు అఽధికారులు గుర్తించారు. ఈ మేరకు బ్యాంకు అధికారుల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు కేసు నమోదు చేశారు. నకిలీ పత్రాలు, తప్పుడు చిరునామాలు దాఖాలు చేసి రుణాలు పొంది బ్యాంకును మోసం చేసినట్లు ఇటీవల జరిగిన ఇంటర్నల్ ఆడిట్లో బట్టబయలైంది. మొత్తం 13మంది లబ్ధిదారులు ఈ పని చేసినట్లు గుర్తించారు. 2017, 2018లలో ఈ వ్యవహారం నడిచింది. బ్యాంక్లో రుణాలు పొందిన వారు సక్రమంగా తిరిగి చెల్లింపులు చేయడం లేదు. వారు రుణం తీసుకొన్న సమయంలో సమర్పించిన పత్రాలు, ఇచ్చిన చిరునామాలు సక్రమంగా లేవు. అంతే కాకుండా రుణం తీసుకున్న వారు ఎక్కడ ఉన్నారో బ్యాంక్ అధికారులకు తెలియడం లేదు. దీంతో బ్యాంక్ ప్రస్తుత మేనేజర్ జి.ఎస్. వెంకట్రావు రుణ మాయాజాలంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నకిలీ ధ్రువప త్రాలు దాఖలు చేసి రుణాలు పొందిన వారి కోసం గాలిస్తున్నారు. అదే సమయంలో అప్పట్లో పనిచేసిన బ్యాంక్ అధికారులు ఎవరు అనే కోణంలో కూడా విచారణ ప్రారంభించారు.