ఈబీసీ నేస్తంతో 2,888 మందికి లబ్ధి
ABN , First Publish Date - 2022-01-26T04:17:52+05:30 IST
ఈబీసీ నేస్తంతో 2,888 మందికి లబ్ధి
కలెక్టరేట్, జనవరి 25: ఈబీసీ నేస్తంతో జిల్లాలో 2,888 మందికి లబ్ధి చేకూరినట్టు కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ తెలిపారు. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.4.33 కోట్లు జమవుతాయని చెప్పారు. ఈబీసీ నేస్తం కార్యక్రమాన్ని మంగళవారం సీఎం జగన్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గాల వారీగా లబ్ధిదారుల వివరాలను వెల్లడించారు. ఆమదాలవలస నియోజకవర్గంలో 146 మంది, ఎచ్చెర్లలో 347 మంది, ఇచ్ఛాపురంలో 543 మంది, నరసన్నపేటలో 121 మంది, పాలకొండలో 173 మంది, పలాసలో 350 మంది, పాతపట్నంలో 308 మంది, రాజాంలో 407 మంది, శ్రీకాకుళంలో 369 మంది, టెక్కలి నియోజకవర్గంలో 124 మంది లబ్ధిదారులు ఉన్నట్టు తెలిపారు. అనంతరం నమూనా చెక్కులను లబ్ధిదారులకు అందించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, జేసీలు కె.శ్రీనివాసులు. ఆర్.శ్రీరాములు నాయుడు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, అంధవరపు సూరిబాబు, ఎంఈవీ పద్మావతి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఆర్.డడ్డెమ్మ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటే కీలకం
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటే కీలకమని.. 18ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మంగళవారం శ్రీకాకుళం బాపూజీ కళామందిర్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. గ్రామ వార్డు సభ్యుడి నుంచి దేశ ప్రధాని వరకూ ఎన్నుకునే శక్తి ఓటు హక్కుకు ఉందన్నారు. దేశంలో 80 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పా రు. యువత ఓటర్లుగా చేరేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. స్వీప్ నోడల్ అధికారి, జేసీ ఎం. విజయసునీత మాట్లాడుతూ..ఓటరు నమోదులో యువత భాగస్వామ్యం అవసరమన్నారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా రెవెన్యూ అధికారి సీతారామమూర్తి మాట్లాడుతూ.. ఓటు హక్కుతో నిజాయితీ గల ప్రజాప్రతినిధులను ఎన్నుకోవచ్చుని చెప్పారు. ముందుగా కలెక్టర్ ఓటరు నమోదుపై ప్రతిజ్ఞ చేయించారు. ఓటు వినియోగంపై శివాని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన లఘు నాటిక ఆకట్టుకుంది. సీనియర్ ఓటర్లు సత్యనారాయణ, నాగేశ్వరరావు మల్లేశ్వరరావు, తదితరులను సత్కరించారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహన్రావు, శ్రీకాకుళం తహసీల్దార్ వెంకటరావు, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.