280 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2020-08-12T10:46:22+05:30 IST
నెల్లూరు రూరల్ ప్రాంతంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతోంది.
విలువ రూ.పది లక్షలపైనే...
రూ.64 లక్షల ధాన్యం సీజ్
నెల్లూరు (రూరల్), ఆగస్టు 11 : నెల్లూరు రూరల్ ప్రాంతంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతోంది. ఇటీవల ఓ రైసు మిల్లులో అధికారులు భారీ స్థాయిలో ‘చౌక’ బియ్యాన్ని పట్టుకోగా తాజాగా గుడిపల్లిపాడులోని పీవీఎన్ రైస్మిల్లులో 280 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం పట్టుకున్నారు. దీని విలువ రూ.10.8 లక్షలుగా లెక్కకట్టారు. మిల్లు యజమాని పై 6ఏ కేసు నమోదు చేసిన అధికారులు మిల్లులోని బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మిల్లు గోదాములో యజమానికి చెందిన రూ.33,53,462 విలువ చేసే 1827.50 క్వింటాళ్ల ధాన్యంతోపాటు సీఎంఆర్కు చెందిన రూ.28,90,125 విలువ చేసే 1575 క్వింటాళ్ల ధాన్యం నిల్వ ఉన్నట్లు గుర్తించారు.
వాటిని కూడా అధికారులు సీజ్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. రేషన్ బియ్యాన్ని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో డీఎస్వో బాలకృష్ణారావు, వెంకటగిరి, కోవూరు సీఎస్డీటీలు రవిబాబు, కృష్ణప్రసాద్, నెల్లూరు ఏఎస్వో రవి, స్థానిక వీఆర్వో కుమార్ తదితరులు పాల్గొన్నారు.