26/11 దాడులు.. రియాజ్‌ బైక్‌ నంబరు!

ABN , First Publish Date - 2022-07-02T08:23:30+05:30 IST

దర్జీ కన్హయ్యాలాల్‌ను హత్య చేసిన నిందితులు పారిపోయేందుకు ఉపయోగించిన బైక్‌ తాలూకు రిజిస్ట్రేషన్‌ నంబర్‌ విషయంలో సంచలన విషయం బయటపడింది.

26/11 దాడులు.. రియాజ్‌ బైక్‌ నంబరు!

ముంబై ఉగ్రదాడి స్ఫురణకొచ్చేలా 2611 నంబరు కోసం 5 వేల చెల్లింపు

జైపూర్‌, న్యూఢిల్లీ, జూలై 1: దర్జీ కన్హయ్యాలాల్‌ను హత్య చేసిన నిందితులు పారిపోయేందుకు ఉపయోగించిన బైక్‌ తాలూకు రిజిస్ట్రేషన్‌ నంబర్‌ విషయంలో సంచలన విషయం బయటపడింది. 14 ఏళ్ల క్రితం ముంబై పేలుళ్లు జరిగిన తేదీ స్ఫురణకు వచ్చేలా ఆ నంబరు ఉండటం విశేషం. ఉదయ్‌పూర్‌లో కన్హయ్యను కత్తితో నరికి చంపిన హంతకులు రియాజ్‌, గౌస్‌ ‘ఆర్‌జే 27 ఏఎస్‌ 2611’ అనే నంబరు గల బైక్‌పై పారిపోయారు. ఈ బైక్‌ రియాజ్‌ పేరిట రిజిస్టర్‌ అయివుంది. 2008 నవంబరు 28న ముంబైలో భారీ ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. నాటి ఘటన 26/11గా ప్రచారంలో ఉంది. రియాజ్‌ రూ..5 వేలు వెచ్చించి మరీ ఈ నంబరు కొనుక్కున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, రియాజ్‌ పాస్‌పోర్టు ఆధారంగా అతడు 2014లో నేపాల్‌కు వెళ్లినట్లు, ఫోన్‌లోని వివరాల ప్రకారం అతడి సెల్‌ నుంచి పాకిస్థాన్‌కు కాల్స్‌ వెళ్లినట్లు నిర్ధారించారు. మరోవైపు ఉదయ్‌పూర్‌ ఘటనకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఉన్న కంటెంట్‌ను తొలగించాలని ఆ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నోటీసులిచ్చింది. మరోవైపు.. హత్యలో తమ పాత్ర లేదని పాక్‌కు చెందిన సున్నీ సంస్థ ‘దావత్‌-ఎ-ఇస్లామీ’ ప్రకటించింది.

Updated Date - 2022-07-02T08:23:30+05:30 IST