TS: ఉన్నత విద్యలో 2.50 లక్షల సీట్లు ఖాళీ!

ABN , First Publish Date - 2021-10-18T16:42:52+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్యలో భారీగా సీట్లు మిగిలిపోయాయి. డిగ్రీ, ఇంజనీరింగ్‌ వంటి కోర్సుల్లో సుమారు 2.50 లక్షలకు పైగా సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో సుమారు 2.19 లక్షల డిగ్రీ సీట్లు, 31 వేల ఇంజనీరింగ్‌ సీట్లు ఉన్నాయి. ఈ సీట్ల భర్తీ కోసం పలు దఫాలుగా..

TS: ఉన్నత విద్యలో 2.50 లక్షల సీట్లు ఖాళీ!

డిగ్రీ, ఇంజనీరింగ్‌ కోర్సుల్లో భారీగా..

పలుమార్లు కౌన్సెలింగ్‌.. చేరని విద్యార్థులు

డిగ్రీ నాలుగో విడతకు అధికారుల సన్నద్ధం!

ఇంజనీరింగ్‌ సీట్లకూ మరోసారి కౌన్సెలింగ్‌


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్యలో భారీగా సీట్లు మిగిలిపోయాయి. డిగ్రీ, ఇంజనీరింగ్‌ వంటి కోర్సుల్లో సుమారు 2.50 లక్షలకు పైగా సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో సుమారు 2.19 లక్షల డిగ్రీ సీట్లు, 31 వేల ఇంజనీరింగ్‌ సీట్లు ఉన్నాయి. ఈ సీట్ల భర్తీ కోసం పలు దఫాలుగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నా వాటిలో చేరడానికి విద్యార్థులు ముందుకు రావడం లేదు. పరీక్షలు లేకుండా ఇంటర్‌ విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించినప్పటికీ ఉన్నత విద్య కోర్సుల్లో చేరుతున్న వారి సంఖ్య తక్కువగానే నమోదవుతోంది. ఈ ఏడాది సుమారు 5 లక్షల మందికి పైగా ఇంటర్‌ విద్యార్థులను పాస్‌ చేసిన విషయం తెలిసిందే. కానీ, ఆ స్థాయిలో ఉన్నత విద్యలో చేరడం లేదు. డిగ్రీ సీట్ల భర్తీని పరిశీలిస్తే దోస్త్‌ పరిధిలో మొత్తం 947 కాలేజీలు ఉన్నాయి. వీటిలో మొత్తం 4,16,575 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్ల భర్తీ కోసం ఇప్పటి వరకు మూడు సార్లు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. కాలేజీల్లో చేరిన విద్యార్థులు మాత్రం 1,96,691 మంది మాత్రమే. అంటే ఇంకా 2,12,143 సీట్లు ఖాళీగా ఉన్నాయి.


వీటితో పాటు నాన్‌ దోస్త్‌, మైనారిటీ వంటి కేటగిరీల్లోని కాలేజీల్లో మరో ఆరు వేల వరకు సీట్లు మిగిలి ఉన్నాయి. డిగ్రీ సీట్ల భర్తీ కోసం మరోసారి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ ప్రక్రియ ముగిసిన తర్వాత డిగ్రీ సీట్ల కౌన్సెలింగ్‌ తేదీని ప్రకటించనున్నారు. కాగా, బీఏ ఆనర్స్‌ పేరిట ఈ ఏడాది నాలుగు కాలేజీల్లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. వీటిపైనా విద్యార్థులు పెద్దగా స్పందించలేదు. సిటీ, నిజాం, కోఠి ఉమెన్స్‌, బేగంపేట ఉమెన్స్‌ కాలేజీల్లో ఈ ఏడాది నుంచి బీఏ ఆనర్స్‌ కోర్సులను ప్రవేశపెట్టారు. మొత్తం 360 సీట్లను అందుబాటులోకి తీసుకురాగా.. 80 శాతం పైగా ఖాళీగా ఉన్నాయి. ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రధాన కోర్సుల్లో చేరడానికి కూడా విద్యార్థులు ముందుకు రావడం లేదు. మొత్తం సీట్లలో దాదాపు 40 శాతం ఖాళీగా ఉన్నాయి. ఐఐటీలు, ఎన్‌ఐటీల అడ్మిషన్లు పూర్తయిన తర్వాత మిగిలిన ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్‌ చేపట్టనున్నారు. ఇది నవంబరు మొదటి లేదా రెండోవారంలో నిర్వహించే అవకాశం ఉంది. 

Updated Date - 2021-10-18T16:42:52+05:30 IST