మళ్లీ విశ్వరూపం
ABN , First Publish Date - 2020-06-07T07:13:16+05:30 IST
కరోనా మహమ్మారి జిల్లాలో మళ్లీ తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. శనివారం ఒక్కరోజే విజయవాడ నగరంలోనూ, శివారు ప్రాంతాల్లోనూ 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
జిల్లాలో ఒక్కరోజే 25 పాజిటివ్ కేసులు
విజయవాడ, ఆంధ్రజ్యోతి : కరోనా మహమ్మారి జిల్లాలో మళ్లీ తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. శనివారం ఒక్కరోజే విజయవాడ నగరంలోనూ, శివారు ప్రాంతాల్లోనూ 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గొల్లపూడిలో ఒకే కుటుంబంలో నలుగురికి వైరస్ సోకింది. కృష్ణలంకలో కొత్తగా 6 కేసులు నమోదు కాగా, చిట్టినగర్, కొత్తపేట, రామలింగేశ్వరనగర్ కట్టపై రెండేసి కేసుల చొప్పున నమోదయ్యాయి. పాతబస్తీలోని బ్రాహ్మణవీధి, భవానీపురం, రామలింగేశ్వరపేట, సత్యనారాయణపురం, బందరురోడ్డు, యనమలకుదురు, గుణదల షిర్డీసాయినగర్, ప్రసాదంపాడులో ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్గా తేలింది. ఈ తాజా కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 526కు చేరుకుంది. అధికారిక లెక్కల ప్రకారం కరోనాతో 22 మంది మరణించగా, రెండు రోజుల క్రితం అజిత్సింగ్నగర్లో ఒకరు, శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీలో మరొకరు మరణించారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఈ మరణాలను ప్రభుత్వం ధ్రువీకరించాల్సి ఉంది.