చోరీకి గురైన 24 బైక్‌లు స్వాధీనం

ABN , First Publish Date - 2022-06-25T06:25:45+05:30 IST

గత కొంతకాలంగా వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన 24 మోటారు సైకిళ్లను పాయకరావుపేట పోలీసులు స్వాధీనం చేసుకుని, ఇద్దర్ని అరెస్టు చేశారు.

చోరీకి గురైన 24 బైక్‌లు స్వాధీనం
పోలీసులు స్వాధీనం చేసుకున్న బైక్‌లు


ఇద్దరి అరెస్టు :  ఏఎస్పీ మణికంఠ చందోలు 

పాయకరావుపేట, జూన్‌ 24 : గత కొంతకాలంగా వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన 24 మోటారు సైకిళ్లను పాయకరావుపేట పోలీసులు స్వాధీనం చేసుకుని, ఇద్దర్ని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠ చందోలు శుక్రవారం ఇక్కడ విలేఖర్లకు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా నాతవరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పాయకరావుపేట వచ్చిన సమయంలో తన బైక్‌ పోయిందని ఈనెల 20వ తేదీన ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో చోరీకి గురైన వాహనంపై గురువారం ఇద్దరు వ్యక్తులు వెళుతున్నారని అందిన సమాచారం మేరకు ఎస్‌ఐ పి.ప్రసాదరావు సిబ్బందితో వెళ్లి వాహనాన్ని పట్టుకుని, గాజువాకకు చెందిన ఉలవల రాజేష్‌, తాటిచెట్లపాలేనికి చెందిన ఉండ్రు నాగరాజులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా, ఈ ఇద్దరూ గత కొంతకాలంగా వివిధ ప్రాంతాల్లో 24 బైక్‌లు దొంగిలించినట్టు వెల్లడైంది. వీటిలో గాజువాక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఐదు, పాయకరావుపేట, రావులపాలెం, దువ్వాడ, ఎంవీపీ కాలనీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు చొప్పున, ఎయిర్‌పోర్టు, ఆలమూరు, స్టీల్‌ప్లాంట్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఒక్కొక్కటి, వివరాలు తెలియని మరో ఏడు బైక్‌లు చోరీ చేసినట్టు గుర్తించారు. అనంతరం వివిధ ప్రాంతాల్లో దాచి ఉంచిన ఈ మొత్తం వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను పట్టుకున్న  సిబ్బందికి రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నక్కపల్లి సీఐ నారాయణరావు, ఎస్‌ఐలు పి.ప్రసాదరావు, శిరీష తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-25T06:25:45+05:30 IST