గుజరాత్‌లో 24 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం

ABN , First Publish Date - 2021-09-16T20:11:40+05:30 IST

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మంత్రివర్గంలో 24 మంది

గుజరాత్‌లో 24 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం

గాంధీనగర్ : గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మంత్రివర్గంలో 24 మంది మంత్రులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మంత్రివర్గంలోని మంత్రులకు ఈసారి చోటు దక్కలేదు. శాసన సభ మాజీ స్పీకర్ రాజేంద్ర త్రివేది, గుజరాత్ బీజేపీ మాజీ అధ్యక్షుడు జీతూ వఘానీలు నూతన మంత్రివర్గంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 


భూపేంద్ర పటేల్ మంత్రివర్గంలో 24 మందికి చోటు కల్పించారు. వీరిలో 10 మంది కేబినెట్ మంత్రులు, 14 మంది సహాయ మంత్రులు, సహాయ మంత్రుల్లో ఐదుగురు స్వతంత్ర హోదాగల మంత్రులు. వీరి చేత గవర్నర్ ఆచార్య దేవవ్రత్ రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో విజయ్ రూపానీ కూడా పాల్గొన్నారు. 


భూపేంద్ర పటేల్ గుజరాత్ 17వ ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ మంత్రులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేసినవారిలో... రాజేంద్ర త్రివేది, జీతూ వఘానీ, హృషికేశ్ పటేల్, పూర్ణేష్ మోదీ, రాఘవ్‌జీ పటేల్, కానూభాయ్ దేశాయ్, కిరీట్ సింహ్ రాణా, నరేశ్ పటేల్, ప్రదీప్ పర్మార్, అర్జున్ సింహ్ చౌహాన్ ఉన్నారు.


Updated Date - 2021-09-16T20:11:40+05:30 IST