పేరుకే 24 గంటల ఆస్పత్రి .. గుమ్మఘట్టలో అందని వైద్యం

ABN , First Publish Date - 2021-04-21T06:07:48+05:30 IST

స్థానికంగా 24 గంటల వైద్య ఆస్పత్రి ఉన్నా... ఇక్కడ పేద ప్రజలకు వైద్యసేవలు అందక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉన్నా... ఒక వైద్యుడు మాత్ర మే విధులు నిర్వహిస్తున్నారు.

పేరుకే 24 గంటల ఆస్పత్రి .. గుమ్మఘట్టలో అందని వైద్యం
గుమ్మఘట్ట ప్రభుత్వాస్పత్రి

గుమ్మఘట్ట, ఏప్రిల్‌ 20 : స్థానికంగా  24 గంటల వైద్య ఆస్పత్రి ఉన్నా... ఇక్కడ పేద ప్రజలకు వైద్యసేవలు అందక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉన్నా...   ఒక వైద్యుడు మాత్ర మే విధులు నిర్వహిస్తున్నారు. మహిళా వైద్యురాలు ఆరు నెలల క్రితం బదిలీపై వెళ్లడం... ఇక్కడి వైద్యశాలలో ఉన్న వైద్యాధికారి కొవిడ్‌ చికిత్స కేంద్రాలకు డ్యూటీపై వెళుతుండటంతో  ఇక్కడి ప్రజలు  వైద్యసేవలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలోని ముగ్గురు స్టాఫ్‌ నర్సులు వుండాల్సి వుండగా ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఓ స్టాఫ్‌ నర్సు తన రాజకీయ పలుకుబడితో అనంతపురం జనరల్‌ ఆస్పత్రిలో డిప్యూటేషనపై వెళ్లడంతో ఇక్కడ ఆస్పత్రిలో సేవలకు అంతరాయం కలుగుతోంది. ఇక సామాన్యులకు రక్త పరీక్షలు నిర్వహించాల్సిన ల్యాబ్‌ టెక్నీషియన  సైతం తన స్వప్రయోజనాల కోసం ఇక్కడి నుంచి  డిప్యూటేషనపై వెళ్లినట్లు తెలుస్తోంది.  ఇక ఆస్పత్రిలోని ఫార్మసిస్టు వారంలో రెండు మూడు రోజులు మాత్రమే విధులకు హాజరవుతున్నట్లు తెలిసింది. 24 గంటల ఆస్పత్రిగా పేరున్నప్పటికీ ఇక్కడి ఆస్పత్రిలో స్టాఫ్‌ నర్సులు, ఇతర గ్రామీణ ప్రాంతాల ఆరోగ్య సిబ్బందిచే ప్రజలకు తాత్కాలిక వైద్యసేవలు అందుతున్నట్లు ఇక్కడి ప్రజలు వాపోతున్నారు. అత్యవసర చికిత్సల నిమిత్తం రోగులను రాయదుర్గం, కళ్యాణదుర్గం, అనంతపురం ఆస్పత్రులకు సొంత ఖర్చులతో తీసుకెళ్లాల్సి వస్తోందన్నారు. ఈ ఆస్పత్రిలో మహిళా వైద్యురాలు లేకపోవడంతో ప్రసవాల కోసం మండలంలోని వివిధ గ్రామాల నుంచి కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆస్పత్రికి వెళుతున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు. ఈ సమస్యలపై గతంలో పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదంటూ వారు ఆరోపిస్తున్నారు. సకాలంలో వైద్యం అందక  పలువురు రోగులు మృత్యువాత పడిన సంఘటనలు కోకొల్లలు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు ఈ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 


Updated Date - 2021-04-21T06:07:48+05:30 IST